చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో సీఎం అనే పదానికి కొత్త అర్ధం ఇచ్చారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు సీఎంగా కాకుండా కమీషన్ మినిస్టర్లా పనిచేశారంటూ ఎద్దేవా చేశారు. విద్యుత్ కొనుగోళ్ల పీపీఏలపై ప్రభుత్వం సమీక్షిస్తే చంద్రబాబు ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లలో 5 వేల కోట్ల కమీషన్లు దండుకున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రాజకీయ జీవితంలో ఆయన రోజురోజుకు దిగజారుతున్నారని చురకలంటించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శ్రీకాంత్రెడ్డి గురువారం విలేకరులతో మాట్లాడారు. మొన్నటివరకు 'ఖబర్దార్' అంటూ కేంద్రాన్ని హెచ్చరించిన చంద్రబాబు ఇప్పుడెందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. రైతుల పొట్టకొట్టి హెరిటేజ్లో అధిక రేట్లకు అమ్ముకోవడం లేదా అని ప్రశ్నించారు.