నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం.. పోలీసుల అప్రమత్తం

నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం సందర్భంగా అమరావతి రాజధాని ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే అవకాశమున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Update: 2019-12-27 02:41 GMT

నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం సందర్భంగా అమరావతి రాజధాని ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే అవకాశమున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నంకు మార్చాలని కేబినెట్ తన నిర్ణయాన్ని ప్రకటించినట్లయితే అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్ ను విధించాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. అంతేకాకుండా సీఎం నివాసం, అసెంబ్లీ, సచివాలయం పరిధిలోని నివాసాలకు ఇప్పటికే నోటీసులు అంటించారు.. బంధువులు, ఇతరులు ఎవ్వరూ వచ్చినా ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే గొడవలు జరుగుతాయని భావిస్తున్న ఉద్దండరాయునిపాలెం, తుళ్లూరు ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేకంగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తం వెయ్యిమందికి పైగా పోలీసులు శాంతిభద్రతలను కాపాడేందుకు ఉన్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.

క్యాబినెట్ సమావేశం అనంతరం ప్రకటన వెలువడిన వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేల కోసం భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు. వేరే ప్రాంతం వారిని సీఎం నివాసం, సచివాలయం ప్రాంతానికి రాకుండా ఆంక్షలు విధించారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తుళ్ళూరులో రైతుల ధర్నాపై ఇంటిలిజెన్స్ ఆరా తీస్తోంది. ఇదిలావుంటే కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నానికి మార్చాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తుళ్లూరు లోని ఒక గ్రామంలో, రాజధాని కోసం నాలుగు ఎకరాల భూమి ఇచ్చిన రైతు ఆత్మహత్యాయత్నం చేయబోతే పోలీసులు అతన్ని అడ్డుకున్నారు.

గురువారం విజయవాడలో పార్లమెంటు సభ్యుడు కేసినేని నాని సహా కొంతమంది టీడీపీ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. మరోవైపు శుక్రవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజధానికి పునాది రాయి వేసిన ప్రాంతంలో మౌన ప్రదర్శన నిర్వహిస్తానని ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ జరుగుతున్నప్పటికీ, కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నానికి మార్చాలనే ప్రతిపాదనతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలి?, రైతుల మనోవేదనలను ఎలా పరిష్కరించాలో సూచించడానికి కేబినెట్ ఉప కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించవచ్చని సమాచారం. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డితో జరిగిన సమావేశం తరువాత వైయస్ఆర్సిపి నాయకులు మీడియాతో చెప్పిన విషయాల నుండి ఈ సూచన ప్రచారంలోకి వచ్చింది. 

Tags:    

Similar News