నిన్న(గురువారం) ఏపీ మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్బంగా క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్రం ప్రకటించిన ఆర్థిక బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటా పది శాతంలో కాపులకు ఐదు శాతం కల్పించాలన్న నిర్ణయానికి చట్టబద్ధత కల్పించాలని తీర్మానం చేసింది. హైకోర్టులో 250 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాలని, ఆస్తుల వేలం తర్వాత ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో, తర్వాత ప్రత్యేక హోదా కోసం చేసిన ఆందోళనల్లోనూ, రాష్ట్ర హక్కుల కోసం (బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో) పోరాడిన నిరసనకారులపైన పెట్టిన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించింది. జయహో బీసీలో సీఎం చంద్రబాబు ప్రకటించిన వరాల అమలుకు దాదాపు రూ.3వేల కోట్ల వ్యయమవుతుందని అంచనా. వీటన్నిటికి అమలుకు ఆమోదం.
పసుపు -కుంకుమ పథకం నిధుల పంపిణీకి, చుక్కల భూముల సమస్యల పరిష్కారంపై ముసాయిదా బిల్లుకు, భూధార్ ప్రాజెక్టుకు చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద అదనంగా మరో 3 లక్షల 55 వేల మందికి పెన్షన్ సౌకర్యం కల్పిస్తూ జనవరి 28న జారీ చేసిన ఉత్తర్వులపై కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇటీవల పెంచిన పింఛన్ల మొత్తం, పసుపు-కుంకుమ చెక్కులు 2, 3, 4 తేదీల్లో గ్రామాల్లోనే స్వీట్లు ఇచ్చి అందజేయాలని నిర్ణయించింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రభుత్వ, నెట్వర్క్ ఆస్పత్రుల్లో డయాలసిస్ తీసుకుంటున్న వారికి అందించే సాయం రూ.2,500 నుంచి రూ.3,000కి పెంపు. కాలేజీ కోసం మూడేళ్లలో రూ. 260 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది.