'జగనన్న అమ్మఒడి' తొలి జాబితా ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'జగనన్న అమ్మఒడి' పధకానికి సంబంధించి లబ్ధిదారుల తొలి జాబితా విడుదల అయింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'జగనన్న అమ్మఒడి' పధకానికి సంబంధించి లబ్ధిదారుల తొలి జాబితా విడుదల అయింది. ఇందులో మొత్తం 41 లక్షల 46 వేల 884 మంది లబ్ధిదారులను గుర్తించింది ప్రభుత్వం. ఈ జాబితాను గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. అయితే అభ్యంతరాలు స్వీకరించాక మరికొంతమందితో తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు 90 శాతం లబ్ధిదారులను గుర్తించినట్టు ప్రభుత్వం చెబుతోంది. మిగిలిన పది శాతంలో కూడా టెక్నీకల్ సమస్యతో గుర్తింపు ఆలశ్యం అయినట్టు తెలుస్తోంది. జనవరి 9న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పధకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.
డబ్బులు లేక ఏ ఒక్క చిన్నారి చదువుకు దూరం కాకూడదన్న ఆలోచనతోనే 'జగనన్న అమ్మఒడి' పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. బిడ్డలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లికి ఈ పథకం కింద ఏటా రూ.15వేలు అకౌంట్లో జమ చేస్తామన్నారు. ఈ పథకాన్ని ముందుగా 1-10 తరగతుల విద్యార్థులకు ప్రవేశపెట్టినా.. ఇంటర్ వరకు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. అమ్మఒడి కోసం బడ్జెట్లలో రూ.6,455.80కోట్లు కేటాయించారు. అయితే ఈ సంఖ్య ఎక్కువయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిధులను కూడా ప్రభుత్వం సమీకరించింది. జనవరి 9న ప్రతి విద్యార్థి తల్లికి రూ. 15 వేలు జమ కానున్నాయి.