మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ తొలగింపు వివాదంలోకి ఏపీ కాంగ్రెస్
ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వివాదంపై హైకోర్టులో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వివాదంపై హైకోర్టులో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు రమేశ్ కుమార్ వ్యవహారంలోకి కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది. రమేష్ కుమార్ తొలగింపు, కనగరాజ్ నియామకం చెల్లదంటూ ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది.
మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపు వివాదం రాజకీయంగా పెనుదుమారాన్ని సృష్టించింది. ఆయనను ఆర్డినెన్సు ద్వారా తొలిగించి వెనువెంటనే మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి కనగరాజ్ను నియమించారు. ఆయన పదవీబాధ్యతలు కూడా తీసుకున్నారు. దీనిపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
ఓ వైపు ఏపీ హైకోర్టులో వివాదం కొనసాగుతుండగానే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలతో రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ మీద విచారణ జరపాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీకి లేఖ రాశారు. రమేష్ కుమార్ సంతకాన్ని టీడీపీ నేతలు కనకమేడల రవీంద్ర కుమార్, వర్ల రామయ్య, టీడీజనార్దన్ ఫోర్జరీ చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని విజయసాయిరెడ్డి డీజీపీని కోరారు. అయితే, దీనిపై స్పందించిన రమేశ్ కుమార్ ఆ లేఖ తానే రాశానని, ఇతరులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు.