నిమ్మగడ్డ లేఖ వెనుక ఆ ముగ్గురి హస్తం.. ఫోరెన్సిక్ ల్యాబ్కు.. డీజీపీకి వైసీపీ ఎంపీ లేఖ
ఇటీవల రాసిన కేంద్ర హోం శాఖకు ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుపై వెలువడ్డ లేఖ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఇటీవల రాసిన కేంద్ర హోం శాఖకు ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుపై వెలువడ్డ లేఖ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్కు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖపై విచారణ జరిపించాలని విజయసాయిరెడ్డి కోరారు. ఇటీవల కేంద్ర హోం శాఖకు రాసిన లేఖలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లని ఆయన పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన సంతకానికి, కేంద్రానికి రాసిన లేఖలో ఉన్న సంతకానికి పొంతన లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఫోర్జరీ సంతకం చేసిన లేఖ కచ్చితంగా టీడీపీ ఆఫీసు నుంచి తయారైందని, తమ దగ్గర పూర్తి సమాచారం ఉందని విజయసాయిరెడ్డి అన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని.. ఈ లేఖ వెనుక టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ఆ పార్టీ నేత వర్ల రామయ్య, టీడీ జనార్ధన్ల హస్తం ఉందని ఆరోపించారు.
టిడిపి నేతలు కలిసి ఈ లేఖను సృష్టించారని, రమేష్ కుమార్కు తెలిసే ఈ తతంగమంతా జరిగిందని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఫోర్జరీ సంతకాలు, కల్పిత డాక్యుమెంట్లపై డీజీపీ విచారణ చేయాలని విజయసాయిరెడ్డి కోరారు. ఆ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాలని, దీనిపై వచ్చే రిపోర్ట్ ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజయసాయిరెడ్డి డీజీపీ కి రాసిన లేఖలో పేర్కొన్నారు.