ఇంగ్లీష్ మీడియంపై అవసరమైతే సుప్రీంను ఆశ్రయిస్తాం
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరిగా అమలు చేస్తూ.. తీసుకొచ్చిన జీవోను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరిగా అమలు చేస్తూ.. తీసుకొచ్చిన జీవోను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. పేదలకు ఆంగ్ల మాద్యమంలో విద్యాబోధన అందించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కోర్టు తీర్పు కాపీ అందలేదని, తీర్పు కాపీ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.
హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవో 81, 85 లను రద్దు చేసిన అంశాలపై రాజకీయం చేయడం సరికాదన్నారు. 'సీఎం వైఎస్ జగన్ ఆలోచనా విధానం అందరికి తెలుసు. ఏదైనా మాట ఇస్తే ఆ మాట కోసం నిలబడతారన్నారు. బడగుబలహీనవర్గాలవారు ఉన్నతంగా... చదవాలి అని సిఎం తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కోర్టు తీర్పు విజయంగానో, అపజయంగానో చూడకూడదు. ప్రస్తుతం వెలువడిన కోర్టు ఆదేశాలపై తీర్పు కాపీ చూశాక, న్యాయవాదులను సంప్రదించి ఇంగ్లీషు మీడియం అనేది ప్రజాప్రయోజనం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం.' అని ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మాధ్యమంలో స్కూల్స్ కూడా ఏర్పాటు చేస్తామని, అయితే, ఎందుకు ఇలా జరిగిందో తమకు తెలియదని వెల్లడించారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు కాదన్నారు, టీడీపీ నేతల విధానం మార్చుకోవాలని హితవుపలికారు.