మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ తొలగింపుపై హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు
ఎస్ఈసీ పదవి నుంచి అర్డినేన్స్ ద్వారా తనను తొలగించడంపై మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఎస్ఈసీ పదవి నుంచి అర్డినేన్స్ ద్వారా తనను తొలగించడంపై మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంప్రదించలేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి గోపాల కృష్ణ దివేది తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ప్రభుత్వం తరఫున ఈ కౌంటర్ దాఖలు చేశారు.
తనను తొలిగించేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని రమేశ్ కుమార్ ఆరోపణలు వాస్తవం కాదని ద్వివేదీ పేర్కొన్నారు. ఆర్డినెన్స్ రాజ్యాంగ పరిధిలోనే ఉందని, ఎన్నికలు సజావుగా సాగేందుకే ఆర్డినెన్స్ తీసుకొచ్చామని నిమ్మగడ్డ పిటిషన్ తిరస్కరించాలని కోరింది. స్థానిక ఎన్నికల వాయిదాతో.. ఇతర రాష్ట్రాలకు పోలిక లేదని ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బంగాల్లో నెలకొన్న పరిస్థితులను అఫిడవిట్లో ప్రభుత్వం పేర్కొంది.
మరోవైపు స్థానిక ఎన్నికలు పడ్డతర్వాత ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని నిమ్మగడ్డ ప్రకటించడం సరికాదని ద్వివేదీ అభిప్రాయపడ్డారు. ఎన్నికల వాయిదా తర్వాత ఆయన చర్యలు సరికాదని, ఆర్టికల్ 243 ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవీకాలానికీ, సర్వీస్ రూల్స్ విడిగా.. చూడాల్సిందేనని గోపాల కృష్ణ ద్వివేదీ అన్నారు. రాష్ట్ర గవర్నర్కు ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని నిర్ణయించే అధికారం ఉంటుందని.. గవర్నర్ ఆమోదం తర్వాతే ఆర్డినెన్స్ తీసుకొచ్చామని పేర్కొన్నారు.