నేటి నుంచే అసెంబ్లీ.. వీటిపైనే చర్చ!

Update: 2020-06-16 01:58 GMT

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దీనిలో పూర్తిస్థాయి బడ్జెట్తో పాటు వ్యవసాయ బడ్జెట్ ను సంబంధిత మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలు చర్చకు రానున్నాయి. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనుంది.

శాసనసభలో సాధారణ బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి ప్రవేశపెట్టనుండగా.. శాసనమండలిలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే వ్యవసాయ బడ్జెట్‌ను శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, శాసనమండలిలో మంత్రి మోపిదేవి వెంకట రమణ ప్రవేశపెట్టనున్నారు.

రాష్ట్ర గవర్నర్ బిశ్వభుషణ్ హరిచందన్ ప్రసంగం, ఆ తర్వాత బీఏసీ సమావేశం అనంతరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఈసారి బడ్జెట్‌లో కూడా నవరత్నాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్ళలో ఉండేలా బుగ్గన బడ్జెట్‌పై కసరత్తులు చేస్తున్నారు. వ్యవసాయ రంగానికే పెద్ద పీట ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.


Tags:    

Similar News