డిసెంబర్‌ 31తో ముగియనున్న పీఆర్‌సీ కమిటీ గడువు

డిసెంబర్‌ 31తో ముగియనున్న పీఆర్‌సీ కమిటీ గడువు
x
Highlights

* త్వరలో ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశం? * పీఆర్‌సీ అమలుపై కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని ప్రచారం * వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్న వేతనాల పంపిణీ చేసే ఛాన్స్

ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని పోగొట్టడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందా..? కొత్త ఏడాదిలోపు ఉద్యోగులపై వరాలు గుప్పించేందుకు సిద్ధమవుతోందా..? దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలతోపాటు.. పెండిగ్ పీఆర్‌సీని ప్రకటించే విషయంపై చర్చిచే ఛాన్స్ ఉందా..? ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. అటు.. పీఆర్‌సీ కమిటీ నివేదిక ఇచ్చే టైం కూడా దగ్గరపడడంతో సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయన్నది హాట్ టాపిక్‌గా మారింది.

న్యూ ఇయర్ కానుకగా ఉద్యోగుల పీఆర్‌సీపై సీఎం కేసీఆర్ త్వరలోనే కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన ఫిట్‌మెంట్‌ శాతాన్ని ప్రకటించడంతో పాటు.. పీఆర్సీ కమిటీ గడువు పొడిగింపు విషయంలో సీఎం కేసీఆర్‌ నెలాఖరులోగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.

డిసెంబర్‌ 31తో పీఆర్సీ కమిటీ గడువు ముగియనుండగా, మరో మూడు నెలలపాటు పొడిగించాలని పీఆర్సీ చైర్మన్‌ సీఆర్‌ బిస్వాల్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే.. సీఎం నుంచి పిలుపు అందిన వెంటనే పీఆర్‌సీ నివేదికను సమర్పించడానికి సీఆర్‌ బిస్వాల్‌ కమిటీ సిద్ధంగా ఉంది. ఉద్యోగులకు సంబంధించిన కొత్త సర్వీసు నిబంధనల రూపకల్పనపై మరో నివేదిక సమర్పించాల్సి ఉండటంతో మరో మూడు నెలలపాటు పీఆర్సీ కమిటీ గడువు పొడిగించవచ్చన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

మరోవైపు.. గడువు పొడిగింపు ఉత్తర్వులు రాక ముందే సీఎం కేసీఆర్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై ఫిట్‌మెంట్‌ శాతాన్ని ఖరారు చేయడం సహా.. పీఆర్‌సీ అమలుపై కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2021–22.. వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి పెరగనున్న వేతనాలను పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీఆర్‌సీ బకాయిల చెల్లింపులపై సైతం సీఎం కేసీఆర్‌ ముఖ్య ప్రకటన చేస్తారని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. 2018 మేలో పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయగా.. ఇప్పటికే నాలుగు సార్లు గడువు పొడిగించారు. చివరిసారిగా గత ఫిబ్రవరి 18న ప్రభుత్వం గడువు పొడిగించింది. మళ్లీ గడువు పొడిగిస్తే ఉద్యోగ వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశాలుండడంతో ఈసారి కచ్చితంగా పీఆర్‌సీ ప్రకటిస్తారని అధికార వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక, రెండు పట్టభద్రుల మండలి స్థానాలకు ఎన్నికలు, ఆ తర్వాత వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల రూపంలో ఎన్నికల కోడ్‌ అడ్డురానుడడం.. దానికితోడు మార్చి వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండనుండటంతో ఏప్రిల్‌ 1 నుంచి పీఆర్సీ అమలుకు ఆటంకం ఏర్పడనుంది. దీంతో ఈ ఏడాది చివరిలోపే పీఆర్సీ అమలుపై సీఎం నిర్ణయం ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories