
మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హవా..పోస్టల్ బ్యాలెట్లలో ఆధిక్యంలో అధికార పార్టీ
Telangana Municipal Election : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఫిబ్రవరి 13, శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో అధికార కాంగ్రెస్ పార్టీ తన జోరును ప్రదర్శిస్తోంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు జరిగిన ఈ ఎన్నికల ఫలితాల్లో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండగా, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా గట్టి పోటీనిస్తున్నాయి. పలు నియోజకవర్గాల్లో ఫలితాలు ఇప్పటికే వెలువడటంతో ఆయా పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
జిల్లాల వారీగా ఫలితాలు, ట్రెండ్స్
ములుగు జిల్లా: ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ ఇక్కడ ముందంజలో ఉంది. 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకళ కేవలం 6 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించగా, 4వ వార్డులో పావని (367 ఓట్లు), 1వ వార్డులో పద్మ (278 ఓట్లు), 3వ వార్డులో యాసం వసంత విజయం సాధించారు.
మెదక్, సంగారెడ్డి: మెదక్ జిల్లా నర్సాపూర్ 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నరసమ్మ గెలుపొందారు. తూప్రాన్ మున్సిపాలిటీ 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ జైపాల్ నాయక్ విజయం సాధించారు. సంగారెడ్డి ఇంద్రేశం 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత గెలిచారు. రామాయంపేట 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవి విజయం సాధించారు.
నల్గొండ, యాదాద్రి: నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ 7వ వార్డులో చింతల చంద్రారెడ్డి ఘనవిజయం సాధించారు. నందికొండ 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇర్ల రామకృష్ణ 163 ఓట్లతో గెలిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం సాధించగా, 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న గెలుపొందారు.
రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు 4, 5, 7, 11, 12 వార్డుల్లో విజయం సాధించారు. అయితే, 3వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి దాసరి మురళీకృష్ణ 86 ఓట్ల మెజారిటీతో గెలిచి షాక్ ఇచ్చారు.
క్యాంపు రాజకీయాలు
ఫలితాలు వెలువడుతున్న తరుణంలో పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ముఖ్యంగా హంగ్ అయ్యే మున్సిపాలిటీల్లో తమ అభ్యర్థులను కాపాడుకోవడానికి ప్రధాన పార్టీల నేతలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నేతలు తమ అభ్యర్థులను హైదరాబాద్ శివార్లలోని ఫామ్హౌస్లు, రిసార్టులకు తరలిస్తుండగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గెలిచిన అభ్యర్థులకు వెంటనే విప్ జారీ చేయాలని, వారిని ప్రలోభాలకు గురికాకుండా చూడాలని సమన్వయకర్తలను ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. తమకు సరైన సౌకర్యాలు కల్పించలేదని, అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు. ఇక హుజూరాబాద్లో అధికారులు స్ట్రాంగ్ రూమ్ తాళం పోగొట్టడంతో, తాళాలు పగలగొట్టి బ్యాలెట్ బాక్సులను బయటకు తీయాల్సి వచ్చింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బ్యాలెట్ బాక్సులకు సరైన ప్యాకింగ్ లేకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు కౌంటింగ్ నిలిపివేయాలని నిరసన వ్యక్తం చేశారు.
మధ్యాహ్నానికి పూర్తి చిత్రం
మొత్తం 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో, సీసీ కెమెరాల నిఘాలో పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తిస్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మద్యం దుకాణాలు బంద్ చేయడంతో పాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచే ఫలితాలను పర్యవేక్షిస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




