
Cheruvula Panduga: తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో ఇవాళ చెరువుల పండుగ
Cheruvula Panduga: సాగునీటికోసం చేపట్టిన పనులు వివరించే ప్రయత్నం
Cheruvula Panduga: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఊరురా చెరువుల పండగ నిర్వహించనుంది ప్రభుత్వం..రాష్ట్రం ఏర్పాటు తరువాత చెరువుల పునరుద్ధరణ, ఆయకట్టు స్థిరీకరణ ,చెక్ డ్యామ్ ల నిర్మాణంతో పాటు చెరువును ఎప్పుడూ నిండు కుండల ఉండడం రైతాంగానికి ఉపయోగ పడటం ని ప్రజలకు వివరించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పెద్ద చెరువుల వద్ద సాయంత్రం ఐదు గంటలకు చెరువు పండుగ నిర్వహించనున్నారు.గ్రామం నుంచి డప్పులు బోనాలు బతుకమ్మలతో ఊరేగింపుగా వెళ్లనున్నారు..గ్రామంలోని రైతులు మత్స్యకారులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు చెరువు కట్ట వద్దకు చేరుకోనున్నారు. చెరువు గట్టుపై పండగ వాతావరణం ప్రతిబింబించేలా ముగ్గులు, తోరణాలతో అందంగా అలంకరించనున్నారు.
ఇక కట్టమైసమ్మ పూజ చెరువు నీటికి పూజ చేయనున్నారు. తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు బతుకమ్మ కోలాటాలు పాటలు గోరేటి వెంకన్న రాసిన చేరువోయి మా ఊరి చెరువు అనే తదితర పాటలు వినిపించనున్నారు. ఇరిగేషన్ లో వచ్చిన ప్రగతి తద్వారా పెరిగిన పంటల ఉత్పత్తి వివరాలు మత్య సంపద జిల్లాల పెరుగుదల తదితర వివరాలను తెలియజేయనున్నారు. గ్రామ పెద్దలతో పాటు ప్రజాప్రతినిధులు చెరువు గట్టు కార్యక్రమంలో పాల్గొననున్నారు..
ఇక రాష్ట్ర స్థాయిలో రవీంద్రభారతిలోని ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో సాధించిన విజయాలపై సమావేశం.. పుస్తక ఆవిష్కరణ ప్రసంగాలు ఉండనున్నవి.. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజనీర్లు ,రిటైర్డ్ ఇంజనీర్లు మేధావులు తదితరులు పాల్గొననున్నారు..ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ తో పనులు ఖర్చుని ప్రజలకు వివరించనున్నారు..
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే చేపట్టిన బృహత్తరమైన పథకం మిషన్ కాకతీయ. తెలంగాణ భూ భౌతిక పరిస్థితికి అనుగుణంగా కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల సాగునీటి వ్యవస్థ తెలంగాణకు ప్రాణప్రదమైనది. గంగాళాల వంటి చెరువులు పూడిక నిండి తాంబాళాల్లా ఉన్న చెరువులకు నవజీవం తెచ్చే పథకానికి కాకతీయుల స్మరణలో మిషన్ కాకతీయగా నామకరణం చేసింది ప్రభుత్వం.రాష్ట్రంలో 47 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించి, చెరువు కట్టలను పటిష్టపరిచి, కాలువలకు, తూములకు మరమ్మతులు చేసి, పూడిక తొలగించిన ఫలితంగా నేడు రాష్ట్రంలోని చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగిపోయింది. 5,350 కోట్ల రూపాయలు వెచ్చించి చెరువులను పునరుద్ధరించడంతోపాటు, విరివిగా చెక్ డ్యాముల నిర్మాణం చేపట్టి వాగులను పునరుజ్జీవింప చేయటంతో లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడింది. దాదాపు 15 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం 3,825 కోట్లతో 1200 చెక్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టింది. వీటిలో మొదటి దశ 650 చెక్ డ్యాంల నిర్మాణం పూర్తయింది. మిగతా చెక్ డ్యాముల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్దరించబడిన చెరువులకు భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల నుండి కాలువల ద్వారా నీటిని తరలించి ఎండాకాలంలో సైతం పూర్తి స్థాయి నీటి నిల్వతో చెరువులు నిండుగోలాలుగా తయారయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు అడుగంటడం లేదు అంటున్నారు అధికారులు. రాష్ట్రంలో ఉబికిఉబికిపైకి వస్తున్నాయి. చెరువుల కింద ఆయకట్టుకు సాగునీరు సమృద్ధిగా లభిస్తుండటంతో ఆకుపచ్చ తివాచీ పరచినట్టు కనిపిస్తూ పంట పొలాలు కనువిందు చేస్తున్నాయి.ఇలా మిషన్ కాకతీయ ద్వారా చెరువుల ద్వారా జరుగుతున్న లబ్ది ని ప్రజలకు వివరించే ప్రాణళిక తో ముందుకు వెళ్తున్నారు..రేపు సాయంత్రం అన్ని పల్లెల్లో చెరువులు కళకళలాడనున్నవి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




