టీబీజేపీ కొత్త కమిటీ వివాదం.. ఇద్దరు సీనియర్ నేతలకు దక్కని స్థానం


టీబీజేపీ కొత్త కమిటీ వివాదం.. ఇద్దరు సీనియర్ నేతలకు దక్కని స్థానం
తెలంగాణ బీజేపీ కొత్త కమిటీ ఎంపికపై పార్టీ నేతల అభిప్రాయం ఏంటి..? కష్టపడే నేతలకు కమిటీలో పెద్దపీట వేశారా..? అన్ని ప్రాంతాలు, జిల్లాలకు కార్యవర్గంలో సమన్యాయం దక్కిందా..? అందరు నేతల ఏకాభిప్రాయంతోనే కమిటీ కూర్పు జరిగిందా..? లేక కీలక నేతల డామినేషన్ ఏమైనా ఉందా..?
తెలంగాణ బీజేపీ కొత్త కమిటీ ఎంపికపై పార్టీ నేతల అభిప్రాయం ఏంటి..? కష్టపడే నేతలకు కమిటీలో పెద్దపీట వేశారా..? అన్ని ప్రాంతాలు, జిల్లాలకు కార్యవర్గంలో సమన్యాయం దక్కిందా..? అందరు నేతల ఏకాభిప్రాయంతోనే కమిటీ కూర్పు జరిగిందా..? లేక కీలక నేతల డామినేషన్ ఏమైనా ఉందా..? ఆ ఇద్దరు నేతల అనుచురులకే ఎక్కువ పదవులు దక్కాయన్న వాదనలో నిజమెంత..? అదే నిజమైంతే..మరి వారికి నమ్మిన బంటుగా ఉన్న.. ఆ ఇద్దరు సీనియర్లకు ఎందుకు చోటు దక్కలేదు. అందుకే వాళ్లు అలకబూని.. కనీసం పార్టీ ఆఫీస్ వైపు రావడం మానేశారా..? ఎవరా..? ఇద్దరు నేతలు..?
తెలంగాణ బీజేపీ నేతలు కొత్త కమిటీ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. ఆ నిరీక్షణకు తెర దించుతూ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఇటీవల 22 మందితో కొత్త టీంను ప్రకటించారు. ఐతే ఆ కమిటీ కూర్పుపై సొంత పార్టీలోనే భిన్న స్వరాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యవర్గ సభ్యుల ఎంపికలో పక్షపాత ధోరణిని అవలభించారని, పార్టీలో కీలకంగా ఉన్న ఆ ఇద్దరు నేతల అనుచరులకే పెద్ద పీట వేశారని కాషాయ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నయా టీం పార్టీలో జోష్ పెంచాల్సింది పోయి.. మనస్పర్ధాలకు తావిచ్చేదిగా ఉందంటున్నారు కమలం నేతలు.
22 మందితో ప్రకటించిన కమిటీలో కేవలం నలుగురిని మాత్రమే పాత వారిని కంటీన్యూ చేశారు. మిగతా 18మంది స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్ కల్పించారు. ఐతే ఈ కూర్పుపై పార్టీ నేతల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త వారికి, యువతకు ప్రాధాన్యత ఇచ్చారని ఒక వర్గం అంటుంటే...సీనియర్లు, అనుభవం ఉన్న నేతలకు కొంత ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సిందని మరో వర్గం నేతలు చెబుతున్న మాట.
రాష్ట్ర కమిటీలో యువత, కొత్త వారికి అవకాశం ఇవ్వడం బాగానే ఉంది... కానీ ఇది రాష్ట్ర కమిటీ మాదిరి లేదు...కేవలం ఒకే పార్లమెంట్ నియోజకవర్గం కమిటీ లాగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 22 మందితో కొత్త కమిటీ వేస్తే...అందులో 10కి పైగా కేవలం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారే ఉండటంతో కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పట్టణ పార్టీగా పేరొందిన కమలం పార్టీ... ఈ కొత్త కమిటీతో కేవలం ఒకే పార్లమెంట్ పార్టీగా మారిపోయిందని పార్టీలోని ఓ వర్గం నేతలు పెదవి విరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో బలం పెంచుకోవాలంటే... జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేదని అంటున్నారు. కేవలం ఒకటి రెండు జిల్లాలకు చెందిన వారికి ఎక్కువ పదవులు ఇవ్వడం...కొన్ని జిల్లాలను పూర్తిగా విస్మరించారని టాక్ వినిపిస్తోంది. ఎప్పుడు లేని విధంగా ఈ సారి వరంగల్ జిల్లాలను పూర్తి నిర్లక్ష్యం చేశారన్నదే పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఈసారి రాష్ట్ర కమిటీలో కేంద్ర మంత్రులుగా ఉన్నవారి అనుయాయులకే ఎక్కువ పదవులు వచ్చాయని పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఇందులో మరో కొత్త ట్వీస్ట్ ఉంది. తమ వారికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించేందుకు కృషి చేసిన ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు.. వారి అనుచరులుగా ముద్రపడిన ఇద్దరు నేతలను పూర్తిగా విస్మరించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందులో ఒకరు మనోహర్ రెడ్డి కాగా...మరోనేత ప్రకాశ్ రెడ్డి. కొత్త కమిటీలో చోటు దక్కకపోవడంతో ఈ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ ఇద్దరు నేతలు కొత్త కమిటీ ప్రకటించిన తర్వాత పార్టీ రాష్ట్ర కార్యాలయం వైపు రావడం పూర్తిగా తగ్గించడమే ఈ చర్చకు ప్రధాన కారణమని పార్టీ శ్రేణులు అంటున్నారు.
కార్యదర్శిగా పని చేసిన ప్రకాశ్ రెడ్డి....కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. తన వారందరికీ పదవులు ఇప్పించుకున్న కేంద్ర బొగ్గు శాఖ మంత్రి... ప్రకాశ్రెడ్డికి మాత్రం ఏ పదవి ఇప్పించుకోక పోవడంతో పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయా వేదికలపై పార్టీ వాయిస్ ను బలంగా వినిపించడంలో ప్రకాశ్రెడ్డి దిట్ట. అలాంటి నేతకు ఎలాంటి పదవి లేకపోతే ఎలా అని పార్టీలోని ఓ వర్గం నేతలు గుసగుసలాడుతున్నట్లు సమాచారం. మరోవైపు కిషన్రెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటూనే... ప్రతి రోజూ రాష్ట్ర కార్యాలయానికి వస్తూ ప్రతీ కార్యకర్తకు అందుబాటులో ఉంటూ...వారికి కావాల్సిన సమాచారం అందించడంతో పాటు సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. అలాంటి నేత కొత్త కమిటీ ప్రకటన తర్వాత స్టేట్ ఆఫీస్ వైపు రావడానికి కూడా ఇష్టపడటం లేదని టాక్ వినిపిస్తోంది. పార్టీ కార్యాలయానికి ఎలా రావాలి...ఎందుకు రావాలి అంటున్నారట.
మరో సీనియర్ నేత, మొన్నటి వరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేసిన మనోహర్ రెడ్డిది సేమ్ సిచ్యువేషన్. ఫైర్ బ్రాండ్గా పేరొందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరుడిగా ఈయనకు ముద్ర పడింది. గతంలో బండి సంజయ్ పాదయాత్ర సమయంలో అన్నీ తానై ముందుండి నడిపించారు. అంత కష్టపడినా ఈసారి పార్టీ రాష్ట్ర కమిటీలో చోటు దక్కలేదు. దీంతో నిరాశ చెందిన ఆయన పార్టీ కార్యాలయం వైపు రావడం తగ్గించారు. కొత్త కమిటీలో సింహ భాగం కేంద్ర మంత్రులైనా...కిషన్రెడ్డి, బండి సంజయ్కు చెందిన వారికే ఇచ్చారు కదా మరి.. మనోహర్ రెడ్డికి ఎందుకు రాలేదని పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.
త్వరలో అధికార ప్రతినిధులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అందులోనా అవకాశం వస్తుందా లేదో చూడాలి. కేంద్ర మంత్రులను నమ్ముకున్న ఆ ఇద్దరు నేతలకు ఎలాంటి న్యాయం చేస్తారో.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



