
ఎంపీ స్థానాలపై టీబీజేపీ ఫోకస్.. 10 సీట్లు గెలవడంపై స్కెచ్
BJP: బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలనే వ్యూహం
BJP: తెలంగాణ బిజెపి కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పైన ప్రత్యేక దృష్టి సారించిందా? బలమైన పార్లమెంట్ నియోజకవర్గాలపై పార్టీ స్పెషల్ ఫోకస్ చేయనుందా? మిషన్ పది పార్లమెంట్ స్థానాలు లక్ష్యంగా బిజెపి అడుగులు వేస్తుందా? ఇంతకీ బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది?
బీజేపీ కొన్ని పార్లమెంట్ నియోజక వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించింది. గత పార్లమెంట్ ఎన్నికలలో గెలిచిన సీట్లతో పాటుగా మంచి ఓట్లు సాధించిన నియోజక వర్గాలపై బిజెపి సీరియస్గా దృష్టి సారించింది. ఆ నియోజక వర్గాలలో పాగా వేయడం కోసం కసరత్తు స్టార్ట్ చేసింది. 10 పార్లమెంట్ స్థానాలను గెలవడమే లక్ష్యంగా కమలం పార్టీ స్కెచ్ వేస్తుంది.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. 19.45 శాతం ఓట్లు సాధించింది. మరో నాలుగు స్థానాల్లో డిపాజిట్ లు వచ్చాయి. 9 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ లలో గెలిచింది. హైదరాబాద్ , మహబూబ్ నగర్ లలో రెండో స్థానం లో నిలిచింది. మెదక్,మల్కాజిగిరి స్థానాల్లో బీజేపీ డిపాజిట్ దక్కించుకున్నది. చేవెళ్ల లో 15.54 శాతం, నాగర్ కర్నూలు, జహిరబాద్ లలో 13 శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కి 14 శాతం ఓట్లు వచ్చాయి...గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం చూపిన చోట ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మంచి ఓట్లే సాధించడంతో ఆ పార్లమెంట్ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తుంది.
కమలం పార్టీ గత లోక్సభ ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించిన నియోజకవర్గాల పైన ప్రత్యేక దృష్టి పెట్టింది. 10 పార్లమెంట్ నియోజకవర్గాలపై ప్రత్యేకమైన ఫోకస్ చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గత పార్లమెంట్ ఎన్నికలలో గెలిచిన నాలుగు స్థానాలతో పాటుగా మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్ గిరి, మెదక్, జహీరాబాద్, నాగర్ కర్నూల్ నియోజక వర్గాలపై పార్టీ స్పెషల్ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. బిజెపి ఫోకస్ చేసిన నియోజకవర్గంలో ఎక్కువ వనరులు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రత్యేక దృష్టి సారించిన నియోజక వర్గాల్లోనే ఎక్కువ మంది కార్యకర్తలను పెట్టినట్లు చర్చ జరుగుతుంది. పార్టీ గుర్తించిన బలమైన నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలనే వ్యూహంలో పార్టీ ఉన్నట్లు సమాచారం.
గత పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ శాతం ఓట్లు వచ్చిన ఖమ్మం, మహబూబ్ బాద్, నల్గొండ, పెద్దపల్లి,భువనగిరి నియోజక వర్గాల్లో ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా అద్భుతం జరిగితే గెలిచే అవకాశాలున్నట్టు పార్టీ లెక్కలు వేసుకుంటుంది. బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా బలమైన అభ్యర్థుల వేటలో పార్టీ పడినట్లు తెలుస్తుంది. మరి స్పెషల్ ఫోకస్ చేస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో బిజెపి విజయం సాధించి తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ సీట్లు సాధిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




