పసుపు రైతులను నిండా ముంచుతున్న వ్యాపారులు

పసుపు రైతులను నిండా ముంచుతున్న వ్యాపారులు
x
Highlights

బంగారం ధర ఆకాశాన్నంటుతుంటే వ్యవసాయ మార్కెట్ లో పచ్చ బంగారం నేల చూపులు చూస్తోంది. ఎగుమతులు లేవనే సాకుతో వ్యాపారులు కుమ్మక్కై పసుపు రైతుల కంట్లో కారం...

బంగారం ధర ఆకాశాన్నంటుతుంటే వ్యవసాయ మార్కెట్ లో పచ్చ బంగారం నేల చూపులు చూస్తోంది. ఎగుమతులు లేవనే సాకుతో వ్యాపారులు కుమ్మక్కై పసుపు రైతుల కంట్లో కారం కొడుతున్నారు. ఫలితంగా పెట్టుబడి ఖర్చులు రాకా పసుపు రైతులు లబోదిబోమంటున్నారు. నిజామాబాద్ జిల్లా రైతుల దయనీయ పరిస్థితులపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ.

నిజామాబాద్ జిల్లా పసుపు రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. మొన్నటి వరకు కరోనాతో మార్కెట్ లో కొనుగోళ్లు లేక తీవ్ర ఇబ్బందులెదుర్కొన్న అన్నదాతలకు తాజాగా మద్దతు ధర రూపంలో మరో గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. ప్రస్తుతం మార్కెట్ లో క్రయ విక్రయాలు జరుగుతున్నా గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా 36 వేల ఎకరాల్లో పసుపు సాగు చేయగా 13 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. లాక్ డౌన్ కంటే ముందు సుమారు 10 లక్షల క్వింటాళ్ల పసుపును వ్యాపారులు కొనుగోలు చేశారు. ఆ సమయంలో క్వింటాకు నాలుగు వేల ఐదు వందల నుంచి 5 వేల వరకు ధర పలికింది. అయితే పసుపు విక్రయాలు ఊపందుకునే దశలో..కరోనా ప్రభావంతో మార్కెట్ యార్డుకు తాళాలు పడ్డాయి రెండు నెలల తరువాత మళ్లీ మార్కెట్ ఓపెన్ అయినా రైతులకు తీవ్ర నిరాశే ఎదురౌతోంది. ఈ నామ్ రూపంలో క్రయ విక్రయాలు జరుగుతున్నా..పసుపు ధర నేల చూపులు చూస్తోంది. క్వింటాలుకు 5 వేల నుంచి 5 వేల 5 వందల వరకు మాత్రమే పలుకుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కరోనా మూలంగా ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన పసుపు రైతులు ఇప్పుడు మద్దతు ధర లేక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు.

ఇదిలా ఉంటే రోజుకు 10 వేల బస్తాల పసుపు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఓవైపు మద్దతు ధర లేక మరోవైపు కొనుగోళ్ల ప్రకియ కూడా సరిగ్గా జరగకపోవడంతో పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగుమతులు లేవనే సాకుతో వ్యాపారులు ధరలను తగ్గించేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు భారీగా పెరగడంతో ఇప్పటికే ఆర్థికంగా చాలా నష్టపోయామని ప్రస్తుత పరిస్థితుల్లో క్వింటాలుకు 8 వేల నుంచి 10 వేల వరకు ధరపలికితే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు.

అయితే పసుపు ధర విషయంలో అధికారుల వాయిస్ మాత్రం మరోలా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ పై ధర ఆధారపడి ఉంటుందని రాష్ట్రంలోని ఇతర మార్కెట్ లో సైతం ఇవే ధరలు ఉన్నాయని చెప్తున్నారు. ఏది ఏమైనా కరోనా రూపంలో ఆర్థికంగా చితికి పోయిన పసుపు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories