
Kadamba Tree: కనువిందుగా.. కదంబవృక్షం
Kadamba Tree: సరస్వతి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబ వృక్షం
Kadamba Tree: ఏడాదిపొడవునా ఆకుపచ్చగా ఉండే ఆ వృక్షమంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. ఆ చెట్లవనం ఎక్కడుంటే అక్కడ ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం వెళ్లివిరుస్తుందని ప్రతీతి. అమ్మవారికి..ఆ వృక్షాలకి లింకేంటీ ఆనుకుంటున్నారా. అయితే ఈ విషయం తెలుసుకోవాలంటే మనం చదువుల తల్లికొలువు తీరిన నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రానికి వెళ్ళాల్సిందే. మన సంస్కృతి సంప్రదాయాలలో మొక్కలకు ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రత్యేకత కలిగిన మొక్కలలో కదంబ ఒకటి.
ఈ కదంబ మొక్కనే రుద్రాక్షాంబ అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని దక్షిణాదిలో జగజ్జనని అమ్మవారిని కదంబవాసి అంటూ పూజలు చేస్తారు. అదేవిధంగా హనుమంతుడు పుట్టుకకు కారణం కూడా ఈ మొక్క అని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికల చీరలను దొంగలించి దాచింది కూడా ఈ వృక్షంలోనే అంటుంటారు. అయితే చదువుల తల్లిగా పిలువబడే బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇక్కడ వేలాదిగా వెలిసిన కదంబ వృక్షాలు కనువిందు చేస్తాయి. బాసర పుణ్యక్షేత్రంలోని ముఖద్వారంతో ప్రారంభమయ్యే ఈ వృక్షాలు బాసరలో అడుగడుగునా కనిపిస్తాయి.
బాసర ప్రధాన రహదారులతో పాటు ఆలయ ప్రాంగణం, గోదావరి నదీ తీరంవరకు కదంబ మొక్కలు కనిపిస్తుంటాయి. ఇలా ఎక్కడ చూసిన పచ్చదనాన్ని కమ్ముకుని కనువిందుచేస్తున్నాయి.యేడాది పొడవునా ఆకులు రాలకుండా, ఎ క్కడ కూడా ఎండు ఆకులు కనపడకుండా ఉంటాయి. అయితే ఏడాది పొడవునా పచ్చగా ఉండే ఈ చెట్లంటే అమ్మవారికి ఎంతో ఇష్టమని చెప్పుకుంటారు. సరస్వతీ దేవి పసిప్రాయంలో కదంబవృక్షాలు ఉన్న ప్రాంతంలో ఆటలాడుకునేదని, లలిత సహాస్రనామాల్లో సైతం దేవి కదంబవనంలో సంచరించినట్లుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ కదంబ వృక్షాలంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రం.
అమ్మవారికి ఇష్టమైన ఈ ప్రాంతంలో విరివిగా కదంబ వృక్షాల పెంపకం చేపట్టడం జరిగింది. సుమారు 5 వేలకు పైగా కదంబ వృక్షాలున్నట్లుగా నిర్వహకులు పేర్కొంటున్నారు.ఎంతో పవిత్రమైన ఈ కదంబ వృక్షం గురించి భగవద్గీత, మహాభారతంలో కూడా ప్రస్తావించారు. కదంబ వృక్షం చూడటానికి ఎంతో పెద్దగా ఉండి ఈ పూలు గుండ్రని ఆకారంలో కలిగి ఉంటాయి. ఈ పుష్పాలను ఎక్కువగా లలితాదేవి పూజలో ఉపయోగిస్తారు. అదేవిధంగా ఈ వృక్షాన్ని ఉపయోగించి వివిధ రకాల బొమ్మలను తయారు చేస్తారు. అన్ని రకాల వృక్షాలు మాదిరిగా ఈ చెట్టు ఆకులురాలవు ఎల్లప్పుడూ పచ్చగానే కనిపిస్తుంది.
వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులను సైతం ఈ చెట్లు కనువిందు చేస్తున్నాయి. సరస్వతీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గతంలో పివి. నరసింహరావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించడంతో పాటు ఇక్కడ ఓ కదంబ వృక్షాన్ని ఆయన చేతులమీదుగా నాటారు. అయితే నేటికి ఆ వృక్షం ఆలయ ప్రాంగణంలో కనిపించడంతో పాటు భక్తుల పూజలందుకోంటోంది.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire