Rave Party Issue: తెలుగు రాష్ట్రాల్లో బ్యాడ్ కల్చర్

Rave Party Issue: పల్లెలకు పాకిన రేవ్ పార్టీల విష సంస్కృతి * హైదరాబాద్ శివార్లలో రెచ్చిపోతున్న నిర్వాహకులు

Sandeep Eggoju
Updated on: 13 March 2021 5:55 PM IST
Rave party Culture increasing in Andhra Pradesh and Telangana
X

ఫోటో ది హన్స్ ఇండియా 

Rave Party Issue: తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ విచ్చలవిడి సంస్కృతి పెరిగిపోతోంది. ఒకప్పుడు గోవా, చెన్నై ప్రాంతాల్లో జరిగిన రేవ్‌ పార్టీల సంస్కృతి పల్లెకు పాకింది. రేవ్ పార్టీల పేరిట బ్యాడ్ కల్చర్ పంజా విసురుతోంది. మందు, చిందుతో యువత రెచ్చిపోతోంది. మూడంకెల జీతాలు అందుకుంటూ.. వీకెండ్ లో రెండు రోజులు సరాదాగా గడుపుదామనుకునే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. మందేస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ తమను తాము మరచిపోయి. అసలు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో చాలామంది తమ జీవితాలను చిద్రం చేసుకుంటున్నారు.

రేవ్ పార్టీ కల్చర్ నగరాలకే పరిమితం అనుకుంటే పొరపాటు. పట్టణాలు దాటి పల్లెలకు చేరింది ఈ విష సంస్కృతి. గోవా, ముంబై లాంటి సముద్ర తీర ప్రాంతాలతో పోటీపడుతూ పల్లెల్లో రేవ్ పార్టీలు జోరందుకుంటున్నాయి. యువతే లక్ష్యంగా సాగుతున్న ఈ దరిద్రపుగొట్టు కల్చర్ తో కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు నిర్వాహకులు.

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రంలో రేవ్‌ పార్టీ కలకలం రేపుతోంది. సంస్థాన్‌లో రేవ్‌ పార్టీ సంచలనం కలిగించింది. గురువారం రాత్రి ఇక్కడి పార్టీలో మద్యం తాగి చిందులేశారు. చుట్టు పక్కల రైతులకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఊరికి దూరంగా ఉన్న ఈ తోటలో పార్టీ ఏర్పాటు ఎవరికీ తెలియదని భావించారు. సోషల్‌ మీడియాలో చేసిన పోస్టుల వల్ల విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ తతంగం, పార్టీ జరిగే తేదీ ఖరారు కావడంతో పోలీసులు కన్నేసి ఉంచారు. యువకులు రావడం గుర్తించారు. మొత్తం 90 మందిని అరెస్టు చేశారు. రేవ్‌ పార్టీ జరిగిన ప్రాంతంలో సిగరెట్లలోని పొగాకును తొలగించి అందులో గంజాయి నింపుకొని తాగిన ఆనవాళ్లు కనిపించాయి. 20 కార్లు, 60 బైకులను స్వాధీనం చేసుకున్నారు.

రేవ్‌ పార్టీల నిర్వహణపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరింస్తున్నారు. అందరిలో మార్పు రాకపోవడంతో వివిధ రకాల సెక్షన్ క్రింద పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ రాచకొండ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఏడుగురు నిర్వాహకులతోపాటు 90 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. వీరినుంచి 400 గ్రాముల గంజాయి, 3 గ్రాముల ఎల్‌ఎస్‌డీ, 120 లిక్కర్‌ బాటిళ్లు, 3 ల్యాప్‌టాప్‌లు, 2 కెమెరాలు, 76 మొబైల్‌ ఫోన్లు, 15 కార్లు, 30 బైకులు, జెనరేటర్‌ వాహనం, 3 డీజే మ్యూజిక్‌ బాక్సులు, 21 ఎంట్రీ టికెట్లు, రూ.27 వేల నగదు, సిగరెట్‌ ప్యాకెట్లు, ఓసీఎం పేపర్లు స్వాధీనం చేసుకున్నట్టు సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story