మిస్టరీగా కరీంనగర్ కారు ఘటన.. డ్రైవర్ సీట్లో ఉండాల్సిన సత్యనారాయణరెడ్డి వెనుక ఎందుకున్నారు?
ఒక్క కారు ప్రమాదం ఎన్నో అనుమానాలు సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యే సోదరి కుటుంబం 20రోజులుగా కనిపించకపోయినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం మిస్టరీగా మారింది....
ఒక్క కారు ప్రమాదం ఎన్నో అనుమానాలు సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యే సోదరి కుటుంబం 20రోజులుగా కనిపించకపోయినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం మిస్టరీగా మారింది. అర్ధరాత్రిపూట కాలువలో ఒక బైక్ పడిపోతేనే స్థానికులకు శబ్ధం వినిపించి రక్షించే ప్రయత్నంచేస్తే నిజంగానే, అంతపెద్ద కారు ప్రమాదానికి గురై కాలువలో పడిపోతే ఎవ్వరికీ కనీసం చప్పుడు కూడా వినిపించలేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాలువలో పడిన బైక్ కోసం వెదుకుతుంటే కారు బయటపడిందని లేదంటే పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్రెడ్డి సోదరి కుటుంబం ఏమైపోయిందనేది ఎన్నాళ్లయినా మిస్టరీగా మిగిలిపోయేది.
అయితే, సత్యనారాయణరెడ్డి కుటుంబం కనిపించకుండాపోయి ఇరవై రోజులైనా, కుటుంబ సభ్యులు గానీ, పనివాళ్లు కానీ, పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదన్నది అనుమానాలకు తావిస్తోంది. దాంతో, పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. సత్యనారాయణరెడ్డి, రాధ, వినయశ్రీ మృతదేహాలు కారు వెనుక సీట్లో కుళ్లిన స్థితిలో దొరకడంతో ఇంటి నుంచి బయల్దేరిన రోజే మరణించారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఇది ప్రమాదమా? లేక యాక్సిడెంట్లా అల్లిన కథా? అనేది మిస్టరీగా మారింది.
కరీంనగర్లోని వావిలాపల్లిలో నివాసముంటున్న సత్యనారాయణరెడ్డి తన భార్య రాధ, కూతురు వినయశ్రీతో కలిసి జనవరి 27న సాయంత్రం 4గంటలకు హైదరాబాద్కు కారులో బయల్దేరారు. ఇది, సత్యనారాయణ ఇంటి దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా రికార్డైంది. దాంతో, హైదరాబాద్ వెళ్లే అన్ని టోల్ప్లాజాల దగ్గర సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే అన్ని టోల్ ప్లాజాలకు సత్యనారాయణరెడ్డి కారు నెంబర్ ఏపీ 15 బీఎన్ 3438ను పంపిన పోలీసులు జనవరి 27కి ముందు ఆ తర్వాత ఎప్పుడైనా వచ్చిందో లేదో వివరాలు సేకరిస్తున్నారు. అయితే, జనవరి 27కి ముందు సత్యనారాయణరెడ్డి కారు పలుమార్లు గుండ్లపల్లి టోల్ ప్లాజా మీదుగా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, జనవరి 27 తర్వాత సత్యనారాయణరెడ్డి కారు రేణికుంట టోల్ప్లాజా దాటలేదని తెలుస్తోంది.
అయితే, కరీంనగర్లోని సత్యనారాయణరెడ్డి ఇంటి నుంచి కాకతీయ కెనాల్ వరకు దాదాపు పది పాయింట్లలో సీసీ కెమెరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, సత్యనారాయణరెడ్డి కారు ఆ సీసీటీవీల్లో రికార్డు అయ్యిందో లేదోనన్నది ఉత్కంఠ రేపుతోంది. అసలు ఏ సమయంలో కారు కెనాల్లో పడిందనేది మిస్టరీగా మారింది. దాంతో, కాలువ దగ్గర్లోని సీసీటీవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఇక, సత్యనారాయణరెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్ ఎక్కడ మిస్సైంది. చివరిగా ఎక్కడ అందుబాటులో ఉందనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. అలాగే, సత్యనారాయణరెడ్డి సెల్ ఫోన్ సిగ్నల్ మిస్సైన ప్రాంతంలో ఎవరెవరి ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయనేది మిస్టరీగా మారింది.
మొత్తానికి, కరీంనగర్ కారు ప్రమాదం కలకలం రేపుతోంది. జనవరి 27నే సత్యనారాయణరెడ్డి ఫోన్ స్విచ్ఛాప్ అయితే, అప్పట్నుంచి కారు దొరికే వరకు ఆ కుటుంబం ఏమైందో ఎక్కడికి వెళ్లిందో కనీసం ఆరా తీసిన వాళ్లే లేకపోవడంతో ముగ్గురి మృతిపై అనుమానాలు పెరుగుతున్నాయి. పైగా, డ్రైవింగ్ సీట్లో ఉండాల్సిన సత్యనారాయణరెడ్డి మృతదేహం కూడా కారు వెనుక సీట్లో ఉండటంపైనా సందేహాలు కలిగిస్తున్నాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire