కేటీఆర్‌కు ప్రతిష్టాత్మకంగా మున్సిపల్‌ ఎన్నికలు.. ఇక తారక రాముడి పట్టాభిషేకమేనంటున్నారు !

కేటీఆర్‌కు ప్రతిష్టాత్మకంగా మున్సిపల్‌ ఎన్నికలు.. ఇక తారక రాముడి పట్టాభిషేకమేనంటున్నారు !
x
కేటీఆర్‌కు ప్రతిష్టాత్మకంగా మున్సిపల్‌ ఎన్నికలు.. ఇక తారక రాముడి పట్టాభిషేకమేనంటున్నారు !
Highlights

సంక్రాంతి ముగ్గుల్లో రంగు రంగు ముగ్గులున్నా, మున్సిపోల్స్‌లో మాత్రం గులాబీ రంగు మాత్రమే పోటెత్తాలంటున్నారు కేటీఆర్. 2020 ఇప్పటికే కేటీఆర్ నామ...

సంక్రాంతి ముగ్గుల్లో రంగు రంగు ముగ్గులున్నా, మున్సిపోల్స్‌లో మాత్రం గులాబీ రంగు మాత్రమే పోటెత్తాలంటున్నారు కేటీఆర్. 2020 ఇప్పటికే కేటీఆర్ నామ సంవత్సరంగా అభివర్ణిస్తున్న మంత్రులు, మున్సిపోల్స్‌లో అదిరిపోయే ఫలితాలు సాధించిన తర్వాత, ఇక తారక రాముడి పట్టాభిషేకమేనంటున్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికల బరిలో, రంజు మీదున్న పుంజులా కేటీఆర్‌ కనిపిస్తున్నారని ఎమ్మెల్యేలంటున్నారు. కేటీఆర్‌కు అత్యంత ప్రతిష్టాత్మకంగా కనిపిస్తున్న పురపాలక పోరు విజృంభణతో ఇక కేటీఆర్‌ పట్టాభిషేకం ఖాయమేనా?

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఏ రకంగా చూసినా, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం. ఎందుకంటే, ఈ ఎన్నికల తర్వాత, తెలంగాణలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్న చర్చ జరుగుతోంది.

మొత్తం 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలకు జరగబోతున్నాయి. జనవరి 22న ఎన్నికలు, 25న ఫలితాలు. ఈ ఎలక్షన్స్‌ బాధ్యతలు కేటీఆర్‌కు అప్పగించారు సీఎం కేసీఆర్. ఈ బాధ్యతలు అప్పగించడం వెనక గులాబీ రథసారథికి పక్కా వ్యూహముందన్న చర్చ జరుగుతోంది. పురపోరులో అఖండ ఫలితాలు సాధిస్తే, కేటీఆర్‌ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. పట్టణాలు, నగరాల్లోని పార్టీలో కేటీఆర్‌ పట్టు మరింతగా దొరుకుతుంది. గతేడాది జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ విజయం సాధించడంతో, ఇప్పటికే కేటీఆర్‌కు, గ్రామస్థాయిలో కార్యకర్తలు హారతి పట్టారు. తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కేటీఆర్‌ మార్క్‌ చూపిస్తే, ఇక గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్న తేడాలేకుండా, కేటీఆర్‌కు పట్టు లభిస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు.

ఇఫ్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. ఏమాత్రం తేడాలొచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫలితాలు బ్రహ్మాండంగా వస్తే, ఆ క్రెడిట్‌ మొత్తం కేటీఆర్‌కే దక్కుతుంది. దీంతో తారక రాముడి పట్టాభిషేకానికి ఇంతకుమించిన సందర్భం మరోటి వుండదని గులాబీ బాస్ లెక్క. విపక్షాలు ఇప్పటికీ కోలుకోకపోవడంతో, మున్సిపల్‌ ఫలితాలు టీఆర్ఎస్‌కు ఏకపక్షమవుతాయని ఆయన ఆలోచిస్తున్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికలు కేటీఆర్‌ రాజకీయ జీవితంలో మేలి మలుపుకానున్నాయన్న చర్చ జరుగుతోంది.

తనపై అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు కేటీఆర్. స్థానిక నేతలతో విస్తృతంగా సమావేశమవుతున్నారు. పార్టీ సోషల్ మీడియా విభాగంతో సమావేశాలు నిర్వహించారు. మకర సంక్రాంతి రోజు, విపక్షాల భ్రాంతి తొలిగిపోయేలా ప్రచారం చెయ్యాలన్నారు. సంక్రాంతి పండుగలోనూ ప్రచారం ఉండాలని చెప్పారు. ముగ్గుల్లో, పతంగులపై కారు గుర్తు, కేసీఆర్ ఫొటోలు ఏర్పాటు చేయాలని కార్యకర్తలకు సూచించారు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల బరిలో పందెం కోడిలా కాలు దువ్వుతున్నారు కేటీఆర్. పురపోరులో అఖండ ఫలితాలు సాధించి, పట్టాభిషేకానికి సిద్దంకావాలని పట్టుదలగా వున్నారు. మరి పురపాలికల బరిలో, రంజు మీద కనిపిస్తున్న కేటీఆర్‌ను, విపక్షాలు ఢీకొంటాయా...? నిలువరిస్తాయా?


Show Full Article
Print Article
More On
Next Story
More Stories