అడవి పందులను చంపి తినే హక్కును ఇవ్వండి : టీఆర్ఎస్ ఎమ్మెల్యే

Sumitra
Published on: 13 Sept 2020 6:20 PM IST
అడవి పందులను చంపి తినే హక్కును ఇవ్వండి : టీఆర్ఎస్ ఎమ్మెల్యే
X

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. శనివారం జనగామ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడారు. అడవి పందులు పంట పొలాలను ఎంతగానో నాశనం చేస్తున్నాయని, అలా పంటపొలాలను నాశనం చేసే అడవి పందులను చంపడం మాత్రమే కాకుండా వాటిని తినే హక్కును కూడా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలను తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కోరారు. అడవి పందుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గుర్తు చేశారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన పంటలను పందులు నాశనం చేస్తుంటే రైతులు ఎంతగానో కుమిలిపోతున్నారన్నారు.

ఇక పోతే తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారినపడ్డ తొలి ఎమ్మెల్యే ఈయనే కావడం గమనార్హం. కాగా అతి తక్కువ సమయంలోనే ఆయన కరోనాను జయించిన క్షేమంగా తన ఇంటికి చేరుకున్నారు. గత జూన్ 12న ఈయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. అది తెలిసిన వెంటనే ఆయన హైదరాబాద్‌ నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కరోనా వైరస్ బారిన పడకముందు ఆయన రాష్ట్రంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అదే విధంగా ఇతర వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక ఆయనకు పాజిటివ్ అని తేలగానే ఎమ్మెల్యేతో సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరు అప్పుడు క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

Sumitra

Sumitra

Next Story