ఆదిలాబాద్ జిల్లాలో మరో కొత్త వ్యాధి

Leptospirosis Case : వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్, వైరల్ జ్వరాలు విజృంభిస్తుంటాయి.

Sumitra
Published on: 12 Aug 2020 5:40 PM IST
ఆదిలాబాద్ జిల్లాలో మరో కొత్త వ్యాధి
X
ప్రతీకాత్మక చిత్రం

Leptospirosis Case : వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్, వైరల్ జ్వరాలు విజృంభిస్తుంటాయి. ఇక ఈ సారి ఈ జ్వరాలతో పాటు కరోనా వైరస్ విస్తరించడంతో ప్రజలు దిక్కతోచని పరిస్థితిలో జీవనం సాగిస్తున్నారు. ఈ రెండు రకాల జ్వరాలతోనే ప్రజలు బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారంటే ఇప్పుడు తాజాగా మరో కొత్త వ్యాధి ఒకటి బయటపడింది. అరుదైన ఈ కొత్త వ్యాధి ఆదిలాబాద్‌ జిల్లాలో బయటపడింది. 'లెప్టోస్పిరోసిస్' అనే ఈ వ్యాధి అచ్చం పచ్చకామెర్ల తరహాలోనే ఉంటుంది. కాగా ఈ వ్యాధిని వైద్యాధికారులు ఇటీవల జిల్లాలో గుర్తించారు. పెద్ద పెద్ద నగరాల్లో ఉండే స్లం ఏరియాల్లో కనిపించే ఈ వ్యాధి ఆదిలాబాద్ జిల్లాలో బయటపడటంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. గత ఏడాది నాలుగు కేసులను ఆదిలాబాద్ జిల్లాలో గుర్తించగా, ఈ ఏడాది కూడా ఈ లెప్టోస్‌పిర కేసు నమోదు అయ్యింది.

ఈ వ్యాధి ఎక్కువగా ఎలుకలు, కుక్కలు, పందులు, పిల్లులు ఇతర జంతువుల మూత్రం ద్వారా వ్యాపిస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. అంతే కాక ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అక్కడక్కడా నిలిచిపోయిన నీరు ఉండడంతో దాని ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాప్తిచెందుతుందని తెలిపారు. ఈ నీటిలో జంతువుల మూత్రం కలిసినప్పుడు ఆ నీటిని తాకిన వారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఇక ఈ వ్యాధి సోకిన వారు ఏవిధమైన లక్షణాలతో బాధపడతారంటే వారి కళ్లు పచ్చగా మారతాయి. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, చలి, వాంతులు కావడం అనేవి ఈ వ్యాధి లక్షణాలు. చాలా మంది అలా కాగానే పచ్చకామెర్లు వచ్చాయేమో అని అనుకుని పచ్చకామర్లకు తగిన చికిత్స తీసుకుంటారు. ఇలా చేయడం వలన వ్యాధి తగ్గకపోగా బాధితుల కాలేయం, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అతి కాస్త లివర్ డ్యామేజీగా మారుతుంది. దాన్ని సకాలంలో గుర్తించకపోతే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. ఊరటనిచ్చే అంశం ఏంటంటే ఈ వ్యాధికి ట్రీట్‌మెంట్ పెద్ద కష్టమేం కాదు. కాకపోతే సకాలంలో దాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. డాక్టర్ల సలహా మేరకు యాంటీ బయోటిక్స్ వాడటం ద్వారా ఈ వ్యాధిని నయం చేయొచ్చు.




Sumitra

Sumitra

Next Story