Jubilee Hills by-election: పొలిటికల్ హీట్ పెంచుతున్న జూబ్లీ హిల్స్ బైపోల్

గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రధాన పార్టీలు నిన్నటితో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ గెలుపే ధ్యేయంగా పార్టీల వ్యూహాలు బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నవీన్ యాదవ్ బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి ప్రచారాలతో హోరెత్తుతున్న జూబ్లీహిల్స్

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 Oct 2025 2:35 PM IST
Jubilee Hills by-election: పొలిటికల్ హీట్ పెంచుతున్న జూబ్లీ హిల్స్ బైపోల్
X

Jubilee Hills by-election: పొలిటికల్ హీట్ పెంచుతున్న జూబ్లీ హిల్స్ బైపోల్ 

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పొలిటికల్ హీట్‌ను పెంచుతుంది. మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో ఉప ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఎలాగైనా ‎ఈ ఎన్నికలో గెలిచేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముందుకు సాగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ కూడా ముగియడంతో ప్రచారాలను మరింత ఉదృతమైంది..ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు.ఉపఎన్నికకు కొద్దిరోజులే ఉండటంతో వీరంతా ప్రచారంలో మునిగిపోయారు. నియోజకవర్గంలోని రెహమత్ ‌నగర్, బోరబండ, ఎర్రగడ్డ, యూసఫ్ గూడ, షేక్‌‌పేట డివిజన్లలో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.


జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీలు, ముస్లింలు ఎక్కువగా ఉండటంతో ఉప ఎన్నికల ఫలితాన్ని వీరే నిర్ణయించనున్నారు. నియోజకవర్గంలోని ఓటర్లలో అధికశాతం బీసీలు, ముస్లింలు ఉండటంతో వీరి ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారే గెలుపొందనున్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ రెండు వర్గాల ఓటర్ల ఆదరణ పొందే పనిలో నిమగ్నమయ్యారు.ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరుతున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ గతంలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. పార్టీ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారంలో జోరు పెంచుతున్నారు.


జూబ్లీహిల్స్‌‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 98 లక్షల 982గా ఉంది. ఇందులో బీసీ ఓటర్లు దాదాపు 2 లక్షల వరకు ఉన్నారు. రెహమత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్గూడ, షేక్‌‌పేట డివిజన్లలో అధిక శాతం పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి చెందిన వారు ఉన్నారు. ఈ డివిజన్లలో ఎక్కువగా బీసీ ఓటర్లు ఉన్నారు. ఇందులో బీసీల తర్వాత ముస్లిం ఓటర్ల సంఖ్యే ఎక్కువగా 96 వేల 500 మంది ఉన్నారు. డివిజన్ల వారిగా చూస్తే బోరబండ, షేక్‌‌పేట, ఎర్రగడ్డలాంటి ప్రాంతాల్లో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు.... ఉప ఎన్నిక ఫలితాలను తేల్చడంతో బీసీల తర్వాత వీరి పాత్ర కూడా కీలకం.


జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో మొత్తం ఓటర్లు 3 లక్షల 98 వేల 982 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 2 లక్షల 7 వేల 367 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1 లక్షా 91 వేల 530 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో ముస్లిం ఓటర్లు 96 వేల 500 మంది అంటే 24 శాతం మంది ఉన్నారు. వీరిలో వలస ఓటర్లు 35 వేలు, ఎస్సీలు 26 వేలు, మున్నూరు కాపు ఓటర్లు 22 వేలు, కమ్మ ఓటర్లు 17 వేలు, యాదవులు 14 వేలు, క్రిస్టియన్లు 10 వేలు ఉన్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయా డివిజన్లలో ఉన్న మైనారిటీ ఓటర్లు కూడా ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారు.


ఇక కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్ళ మధ్య వయసున్న వారు 12వేల 380 ఉన్నారు. అలాగే.. 20 నుంచి 29 మధ్య వయసు వారు 17,500 మంది ఉండగా.. 30 నుంచి 39 మధ్య వయసున్న ఓటర్లు 96 వేల 815 మంది ఉన్నారు. అలాగే 40 నుంచి 49 మధ్య 87 వేల 492 మంది ఉండగా.. 50 నుంచి 59 మధ్య 67 వేల 703, 60 నుంచి 69 మధ్య 38 వేల మంది ఉన్నారు. 70 నుంచి 79 మధ్య వయసు ఉన్న ఓటర్లు 18 వేల మంది, 80 ఏండ్లు ఆ పై వయసుగల ఓటర్ల సంఖ్య 6 వేలకు పైగా ఉన్నట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story