JP Nadda: టీఆర్‌ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన నడ్డా, కేసిఆర్ నియంతృత్వ పోకడలకు..

JP Nadda: *తెలంగాణలో హీటెక్కిన రాజకీయాలు *బండి సంజయ్‌ అరెస్ట్‌పై జాతీయ పార్టీ ఫైర్‌

Shireesha
Published on: 5 Jan 2022 8:28 AM IST
JP Nadda Hot Comments on CM KCR and TRS Party | Telangana News
X

JP Nadda: టీఆర్‌ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన నడ్డా, కేసిఆర్ నియంతృత్వ పోకడలకు..

JP Nadda: అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడం బిజెపికి వరంగా మారింది. రాజకీయంగా రాష్ట్రంలో బలపడాలనుకుంటున్న కమలం పార్టీకి ఉద్యోగుల బదిలీల జీవో 316 అస్త్రంగా మారింది. బండి సంజయ్ జాగరణ పేరుతో చేసిన హడావుడి తో.. సర్కార్ అలర్టయి అరెస్టు చేసి జైలుకు పంపింది. ఇక వెంటనే స్పందించిన కాషాయ పార్టీ... టిఆర్ఎస్ సర్కార్ పై కత్తులు నూరి యుద్ధం ప్రకటించింది. ఏకంగా జాతీయ నాయకత్వాన్ని రాష్ట్రంలో దింపింది.

బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారాన్ని వీలైనంతగా రాజకీయం చేసే ప్రయత్నంలో బీజేపీ సక్సెస్ అయింది. మంగళవారం ఉదయం నుంచి కేంద్రమంత్రులు రాక, బండి సంజయ్‌తో ములాఖత్ వ్యవహారం నడపగా.. సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా షో నడిపారు. ఆయన బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా శాంతియుత ప్రదర్శన చేయాలనుకున్నారు. అయితే.. అనుమతి లేదన్న పోలీసులు.. నడ్డాను అదుపులోకి తీసుకుంటామని లీకులు ఇచ్చారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఇక.. జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన తర్వాత చాలాసేపు అందులోనే ఉండిపోయారు. ఆ తర్వాత అనుమతిచ్చిన పోలీసులు.. కరోనా నిబంధనల ప్రకారం శాంతియుత ర్యాలీ నిర్వహించాలని చెప్పారు. ఆ ప్రకారం సికింద్రాబాద్‌లో ర్యాలీ నిర్వహించి బీజేపీ ఆఫీసుకు వెళ్లిపోయిన నడ్డా.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యోగులకు మద్దతు ఇవ్వడానికే వచ్చామని.. బీజేపీ పై ఎన్ని దాడులు చేసినా పోరాడతామని నడ్డా చెప్పుకొచ్చారు.

దుబ్బాక, హుజూరాబాద్‌లో ఓటమిని కేసీఆర్​ జీర్ణించుకోలేకపోతున్నారని జేపీ నడ్డా విమర్శించారు. అందుకే కేసిఆర్ నియంతృత్వ పోకడలకు వెళ్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్న నడ్డా.. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు కేసీఆర్‌ పాలన ఉందని మండిపడ్డారు. బండి సంజయ్‌ను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్న ఆ‍యన.. సంజయ్‌ అరెస్టుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి నివేదిస్తామని చెప్పారు.

తెలంగాణలో బీజేపీ ధర్మ యుద్ధం చేస్తోందన్న నడ్డా.. ధర్మ యుద్ధాన్ని నిర్ణయాత్మక దశకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. జీవో 317 ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఉద్యోగులు, ప్రజల తరఫున పోరాడాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. జాతీయ పార్టీగా కేసీఆర్‌ ముసుగు తొలగిస్తామన్న నడ్డా.. దేశంలో అత్యంత అవినీతి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆరోపించారు.

మరోవైపు.. బండి సంజయ్‌కు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించడంతో.. ఆ 14 రోజులు నిరసనలు తెలపాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఇదిలా ఉంటే.. ఈ పరిస్థితి చూసిన కాంగ్రెస్ మండిపడుతోంది. బీజేపీని ప్రతిపక్ష పార్టీగా చూపించేందుకు టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story