Temperature: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు

Temperature: వేసవి ఆరంభంలోనే నిప్పులు కక్కుతున్న భానుడు

Sandeep Eggoju
Published on: 1 April 2021 6:40 AM IST
High Temperature in Two Telugu States
X

అధిక ఉష్ణోగ్రతలు (ఫైల్ ఫోటో )

Temperature: వేసవి ప్రారంభంలోనే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఓ వైపు ఎండలు, మరో వైపు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి మొదలవుతున్న వేడి సెగలు రాత్రి ఏడు గంటలైనా తగ్గడం లేదు. రాష్ట్రంలో వారం కిందట 35.8 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 40 డిగ్రీలకు చేరుకుంది.

వాయువ్య, ఉత్తర దిక్కుల నుంచి వీస్తున్న గాలుల ప్రభావం వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మధ్యస్థ భారతదేశంతో పాటు రాజస్థాన్ నుంచి వేడిగాలులు వీస్తుండడం వల్ల తేమ శాతం తగ్గిందని అధికారులు తెలిపారు. దీని కారణంగానే ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని చెప్పారు.

రెండు మూడు రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముందని పలు జిల్లాల్లో 43 డిగ్రీలు నమోదు కావొచ్చని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్​-జూన్​ మధ్య ఉత్తర, తూర్పు భారత దేశంలో ఉష్ణోగ్రతలు సాధారణ గరిష్ఠం కన్నా ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణాదిలో సాధారణ గరిష్ఠం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని అంచనా వేసింది.

గతంలో కంటే వేడిమి ఎక్కువగా ఉండటం ప్రజలను కలవరపరుస్తోంది. పగటి పూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతుండటం వల్ల బయటకి రావడానికి ప్రజలు జంకుతున్నారు. తప్పనిసరి పరిస్ధితుల్లో వచ్చినవారు గొడుగులు, తలకు గుడ్డలు కట్టుకుంటున్నారు. ద్విచక్రవాహనదారులు వేడికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శీతలపానీయాలు, కొబ్బరినీళ్లు తాగి ఎండతాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story