Corona Effect: క‌రోనా వేళ హృదయ విదారక సంఘ‌ట‌నలు

Corona Effect: క‌రోనా వేళ హృదయ విదారక సంఘ‌ట‌నలు
x

కరోనాతో మృతిచెందిన వ్యక్తి (ఫైల్ ఇమేజ్)

Highlights

Corona Effect: భార్య మృతదేహన్ని మూడు కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త * తల్లి మృతదేహంతో కొడుకు బైక్‌పై 20 కి.మీ. ప్రయాణం

Corona Effect: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా రక్కసి.. భారత్‌లో వేలాది మంది ప్రాణాలు బలి తీసుకుంటుంది. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. సరే మృత్యుఘోష ఆగడం లేదు. మరణమే దారుణమనుకుంటే అంతకుమించిన దారుణాలను ఎన్ని చూడాల్సి వస్తుందో తెలియక ఆందోళన కల్గుతోంది. ఇక ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో కరోనా మృతుల విషయంలో సమాజం స్పందిస్తున్న తీరు మానవత్వానికే మాయని మచ్చగా మారుతుంది.

గతంలో ఏదైనా రోగంతో కుటుంబ సభ్యులు కానీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారు కానీ చనిపోతే వందల సంఖ్యలో జనం వచ్చేవారు. హితులు, స్నేహితులు, సన్నిహితులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించే వారు. కానీ. ఇప్పుడు లాక్‌డౌన్‌ నిబంధనల పేరుతో కరోనా మృతులను సందర్శించేందుకు కూడా ఎవరూ రావడం లేదు. చాలా సందర్భారల్లో కుటుంబ సభ్యులు సైతం మృతుల చివరి చూపుకు సైతం నోచుకోవడం లేదు.

కామారెడ్డి రైల్వే స్టేషన్ ప‌రిస‌రాల్లో భిక్షాటన చేసే నాగలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందింది. క‌రోనా విజృంభిస్తోన్న స‌మ‌యంలో ఆమెకు క‌రోనా సోకి మృతి చెందిందేమోన‌ని స్థానికులు భావించారు. ఇంకేముంది ఆమె మృతదేహం వద్దకు వచ్చేందుకు జనం భ‌య‌ప‌డ్డారు.

ఇక ఆటోలో ఆమె మృత‌దేహాన్ని శ్మశాన వాటిక వద్దకు తరలించాల‌ని మృతురాలి భ‌ర్త భావించాడు. అయితే.., అందుకు ఆటోడ్రైవర్ కూడా ఒప్పుకోలేదు. చివ‌ర‌కు అత‌డికి రైల్వే పోలీసులు, స్థానికులు 2వేల 500 విరాళాలు సేకరించి ఇచ్చారు. ఇత‌ర ఏ సాయం చేయ‌డానికి ముందుకు రాలేదు. దీంతో భార్య మృతదేహాన్ని తన భుజాలపై వేసుకుని మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశాన వాటిక‌కు తీసుకెళ్లాడు.

శ్రీకాకుళం జిల్లా పలాసలో కూడా ఇలాంటి హృదయవిదారక సంఘటనే చోటు చేసుకుంది. 50 ఏళ్ల చెంచుల అనారోగ్యంతో తుది శ్వాస విడిస్తే ఆమె మృతదేహాన్ని స్వగ్రామం తీసుకెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలు కానీ.. అంబులెన్స్ గానీ ముందుకు రాలేదు. కరోనాతో ఆమె మృతి చెందిందన్న అనుమానంతో వారు నిరాకరించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన తల్లి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై 20 కిలో మీటర్ల దూరం తీసుకెళ్లాడు ఓ యువకుడు.

మొత్తానికి కరోనాతో మృతిచెందిన వారి అంత్యక్రియల్లో పాల్గొంటే తమకు వైరస్‌ సోకుతుందన్న భయాలతో ఎలా తప్పించుకోవాలా అని కారణాలు వెతుక్కుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో మానవత్వం మంటగలుస్తోందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్తులో కరోనా మృతులు మరింత పెరిగితే పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో అన్న భయాలు నెలకొంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories