ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్ – 700 ఎకరాల భూమి సేకరణకు ఆదేశాలు!

తెలంగాణలో మరో ఎయిర్‌పోర్ట్‌ త్వరలో రానుంది. ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. 700 ఎకరాల భూమి సేకరణకు ఆదేశాలు జారీ కాగా, 2027 నాటికి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

Manjusha
Updated on: 4 Nov 2025 4:26 PM IST
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్ – 700 ఎకరాల భూమి సేకరణకు ఆదేశాలు!
X

తెలంగాణలో మరో విమానాశ్రయం – ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ రాష్ట్రంలో విమాన రవాణా మౌలిక సదుపాయాలను విస్తరించడానికి ప్రభుత్వం మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ (Adilabad Airport) నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు 700 ఎకరాల భూ సేకరణకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈ ఎయిర్‌పోర్ట్‌ను 6 ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సమర్పించిన టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్‌లో ఆదిలాబాద్‌ ప్రాంతం విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా ఉందని పేర్కొంది.

700 ఎకరాల భూమి సేకరణకు ఆదేశాలు

ఆదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధి వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్‌ (Vikas Raj) ఉత్తర్వులు విడుదల చేశారు. కలెక్టర్‌కు భూమి సేకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనుమతి – 362 ఎకరాలు ఇప్పటికే

ఈ సంవత్సరం ఏప్రిల్‌లోనే భారత వైమానిక దళం (IAF) ఆదిలాబాద్‌లో బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం IAF వద్ద 362 ఎకరాల భూమి ఉంది. అయితే, విమానాశ్రయ విస్తరణ, శిక్షణా కేంద్రం నిర్మాణం కోసం అదనంగా 700 ఎకరాలు అవసరమని పౌర విమానయాన శాఖ తెలిపింది.

2027 నాటికి ఆపరేషనల్‌

కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 2027 నాటికి ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించాలనే లక్ష్యాన్ని నిర్ణయించింది. విమానాశ్రయం పూర్తయితే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల ప్రజలకు విమాన ప్రయాణం సులభతరం కానుంది.

అంతర్గాం ఎయిర్‌పోర్ట్ ప్రణాళిక కూడా వేగవంతం

ఇక మరోవైపు పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం మండలంలో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంకు సైతం చర్యలు వేగవంతమవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై AAI ప్రీ-ఫీజిబిలిటీ స్టడీ కొనసాగుతోంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం రూ.40.53 లక్షలు కేటాయించింది.

ముందుగా బసంత్‌నగర్‌లో పాత రన్‌వే వద్ద ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు ప్రతిపాదన ఉన్నా, ఆ ప్రాంత భౌగోళిక అడ్డంకుల కారణంగా అనుకూలం కాదని AAI స్పష్టం చేసింది. అందుకే అంతర్గాం సమీపంలో 591.24 ఎకరాల స్థలం కేటాయించారు.

ప్రాంతీయ అభివృద్ధికి ప్రేరణ

ఆదిలాబాద్, పెద్దపల్లి విమానాశ్రయాలు ప్రారంభమైతే ప్రాంతీయ అభివృద్ధికి ఊతమివ్వడం ఖాయం. ఈ ప్రాజెక్టులు సింగరేణి ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపార వర్గాలు, సాధారణ ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చనున్నాయి.

Manjusha

Manjusha

Next Story