Digital Classes: డిజిటల్ తరగతులపై టి. ప్రభుత్వం ఆలోచన.. ఇంటర్లో నిర్వహించేందుకు సన్నాహాలు

Digital Classes: డిజిటల్ తరగతులపై టి. ప్రభుత్వం ఆలోచన.. ఇంటర్లో నిర్వహించేందుకు సన్నాహాలు
x
Digital classes
Highlights

Digital Classes: కరోనా వైరస్ మరింత విస్తరించడంతో విద్యార్థులకు తరగతులు నిర్వహించడంపై తెలంగాణా ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది.

Digital Classes: కరోనా వైరస్ మరింత విస్తరించడంతో విద్యార్థులకు తరగతులు నిర్వహించడంపై తెలంగాణా ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. గతంలో మాదిరి తరగతులు నిర్వహిస్తే వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం డిజిటల్ క్లాసులను తెరపైకి తెచ్చింది. ఇప్పటికే నష్టపోయిన క్లాసులను భర్తీ చేసే విధంగా సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపింది.

కరోనా వైరస్‌ దెబ్బకు తరగతి గది రూపు రేఖలు మారిపోతున్నాయి. ఇకపై విద్యార్థులంతా కలిసి ఒకే తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధించే పాఠాలు వినే పరిస్థితి కనిపించడంలేదు. కరోనా నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణ కోసం చేపట్టే చర్యలు పలు కీలక సంస్కరణలకు వేదిక అవుతున్నాయి. తరగతి గది పాఠాలు బ్లాక్‌ బోర్డు నుంచి కంప్యూటర్‌ స్ర్కీన్‌ మీదకు మారుతున్నాయి. ఇప్పటికే సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న విద్యా సంస్థలు కరోనాతో ఇకపై ఆన్‌లైన్‌ విద్యకు పెద్దపీట వేయాలని భావిస్తున్నాయి. ఆన్ లాక్ ప్రక్రియ మొదలైన తరువాత కూడా భౌతిక దూరాన్ని పాటించాలని వైద్యలు సూచిస్తున్నారు.

కరోనా నేపథ్యంలో విద్యార్థుల మధ్య భౌతిక దూరాన్ని పాటింపజేయడం సవాలుగా మారనుంది. ఇందుకు అనుగుణంగా తెలంగాణ ఇంటర్‌ బోర్డు విద్యా బోధన ప్రారంభంపై కసరత్తు ముమ్మారం చేసింది. ముందుగా డిజిటల్‌ బోధన, ఆపై షిఫ్ట్‌ పద్ధతిలో క్లాసులు ప్రారంభించాలని భావిస్తోంది. నష్టపోయిన పని దినాల సర్దుబాటు, భౌతికదూరం పాటించేలా డిజిటల్, షిఫ్ట్‌ పద్ధతుల్లో ప్రత్యక్ష బోధన, ఒక్కో సెక్షన్‌లో విద్యార్థుల సంఖ్య కుదింపు వంటి అంశాలపై ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందగానే తొలుత డిజిటల్‌ తరగతుల ప్రారంభానికి సిద్ధమవుతోంది. లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన పని దినాలను సెలవుల రద్దుతో సర్దుబాటు చేయడంతోపాటు 30% సిలబస్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించేలా ప్రతిపాదించింది.

డిజిటల్‌ బోధన, తరగతుల నిర్వహణ ఇలా..: ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు క్లాస్‌రూమ్‌లో రెగ్యులర్‌ విద్యాబోధన సాధ్యం కాదు కాబట్టి డిజిటల్‌ విద్యాబోధనకు ఇంటర్‌బోర్డు మొగ్గుచూపుతోంది. ఇందులో భాగంగా డిజిటల్‌ బోధన, వీడియో పాఠాల రూపకల్పనపై ప్రభుత్వ లెక్చరర్లకు శిక్షణ కూడా ఇప్పిస్తోంది. ఇప్పటికే పలు డిజిటల్‌ పాఠాలు అందుబాటులో ఉన్నా అవి సమగ్రంగా లేకపోవడంతో ప్రభుత్వ లెక్చరర్లతోనే వీడియో పాఠాల చిత్రీకరించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆ పాఠాలను యూట్యూబ్‌లో ఇంటర్మీడియట్‌ బోర్డు చానల్‌లో ప్రసారం చేస్తున్నారు.. మరోవైపు, టీశాట్, దూరదర్శన్‌ వంటి చానళ్ల ద్వారా ఒక్కో సబ్జెక్టులో 30 శాతం పాఠాలను బోధించడం, వాటికి 20 ఇంటర్నల్‌ మార్కులిచ్చే విధానాన్ని ప్రతిపాదించింది.

కరోనా కొంత అదుపులోకి వచ్చాక కూడా కొన్ని నెలలపాటు షిఫ్ట్‌ పద్ధతినే అమలు చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ప్రస్తుతం ఒక్కో సెక్షన్‌లో విద్యార్థుల సంఖ్యను సగానికి కుదించి భౌతికదూరం పాటిస్తూ బోధన చేపట్టాలని ప్రతిపాదించింది. మరోవైపు, అవకాశం ఉంటే అందులో సగం మందికి ఉదయం, సగం మందికి మధ్యాహ్నం విద్యార్థులు హాజరయ్యేలా పరిశీలిస్తోంది. లేదంటే ,సెక్షన్‌లోని సగం మందికి ఒక రోజు ఆఫ్‌లైన్‌ బోధన, మరో సగం మందికి డిజిటల్‌ పాఠాలు బోధించాలని భావిస్తోంది. లేదంటే మూడ్రోజులు ఫస్టియర్, మరో మూడ్రోజులు సెకండియర్‌ తరగతులు నిర్వహించే అంశంపైనా ఇంటర్ బోర్డు కసరత్తు చేసింది. ఆన్‌లైన్‌ బోధనకు అవసరమైన సదుపాయాలు, విద్యార్థులకు ఫోన్లు, డేటా ఉంటే అందుకు అనుగుణంగా ముందుకు సాగే ఆలోచనలు చేస్తోంది.

తరగతి గదుల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు చేపడుతోంది. కళాశాల పరిసరాల పరిశుభ్రత విషయంలో జాతీయ స్థాయి నిబంధనల్ని పాటించడం, రోజూ తరగతి గదులను శానిటైజ్‌ చేయడం, స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ అమలు, తరగతి గదుల్లో మాస్క్‌ తప్పనిసరి చేయడం, హ్యాండ్‌వాష్‌ వంటి అంశాలను పక్కాగా అమలు అయ్యేలా బోర్డు ఫ్లాన్ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ముందుంచిన ఇంటర్ బోర్డు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories