
Telangana: రాష్ట్రంలో దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహం
Telangana: కాంగ్రెస్కు ధీటుగా బహిరంగసభలకు కేసీఆర్ ప్లాన్
Telangana: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దూకుడును అడ్డుకునేందుకు కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారా...? కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బహిరంగ సభలకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారా...? నేతలు పార్టీ మారకుండా ఉండేలా చర్చలు జరుపుతున్నారా...? కేటీఆర్, హరీష్ రావులను కేసీఆర్ రంగంలోకి దించారా...? ఇంతకు గులాబీ బాస్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లనున్నారు...
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా దూకుడు పెంచింది. ఇతర పార్టీల అసంతృప్త నేతలతో సంప్రదింపులు జరిపి... వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించి అధికార బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు.
ఇక కాంగ్రెస్ పార్టీ దూకుడుకు చెక్ పెట్టేందుకు గులాబీ బాస్ కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి ధీటుగా రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలను రూపొందించాలనే దానిపై కేసీఆర్ సమాలోచన చేస్తున్నట్లుగా గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే గులాబీ పార్టీని వీడి వెళ్లే వారి జాబితాను తెప్పించుకుని వారితో చర్చలు జరుపుతున్నట్లుగా టాక్ నడుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన సభకు ధీటుగా త్వరలో బీఆర్ఎస్ పార్టీ తరపున భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీని వదిలి వెళ్తారని భావిస్తున్న నేతలతో మాట్లాడి... వారు పార్టీలోనే కొనసాగేలా మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు గులాబీ బాస్ బాధ్యతలు అప్పగించారు. ఒకవేళ పార్టీని వీడితే నష్టం జరిగే అవకాశం ఉన్న వారితో మాట్లాడి వారిని పార్టీలోనే కొనసాగే విధంగా బీఆర్ఎస్ నేతలు చర్చలు జరుపుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ను చేపట్టింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను లక్ష్యంగా చేసుకుని నేతలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు మరికొంతమంది కీలక నేతలను కేసీఆర్ తమ పార్టీలోకి చేర్చుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోను కాంగ్రెస్, బీజేపీ నుంచి నేతలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. ఆ తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీలోకి నేతల చేరిక పెద్దగా లేకుండాపోయింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ త్వరలో మరిన్ని బహిరంగసభలు నిర్వహించేందుకు సైతం సిద్ధమవుతోంది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. త్వరలో మరికొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఓ జడ్పీ చైర్ పర్సన్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ దూకుడును రాష్ట్రంలో ఏ విధంగా తగ్గించాలనే దానిపై అధికార బీఆర్ఎస్ పార్టీ తర్జనభర్జనలు పడుతోంది.
మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దూకుడును తగ్గించేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలాంటి వ్యూహాన్ని రచిస్తారు. ఆ వ్యూహం ఏ విధంగా వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




