Revanth Reddy: ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన

Revanth Reddy: ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్‌తో సుదీర్ఘ మంతనాలు

Jyothi
Published on: 9 Dec 2023 7:52 AM IST
CM Revanth Reddy Visit to Delhi has Ended
X

Revanth Reddy: ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన

Revanth Reddy: రాష్ట్ర మంత్రులకు కేటాయించాల్సిన శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో సుదీర్ఘ భేటీలు నిర్వహించారు. మంత్రులకు శాఖల కేటాయింపులపై చర్చించారు. రాత్రి 8.40 గంటల సమయంలో కేసీ వేణుగోపాల్‌ నివాసానికి చేరుకున్నారు. కొద్దిసేపటికి మాణిక్‌రావు ఠాక్రే, రోహిత్‌ చౌదరి.. కేసీ ఇంటికి వచ్చారు. రాత్రి 10.30 గంటల వరకు వారు మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చించారు. కీలక శాఖల్లో ఎవరికి ఏం కేటాయించాలనే దానిపై తీవ్రమైన కసరత్తు చేశారు. మరో ఆరుగురికి మంత్రి పదవులు కేటాయించాల్సి ఉండడంతో ఆ అంశంపైనా చర్చ కొనసాగినట్లు సమాచారం.

కేసీ వేణుగోపాల్‌తో భేటీ పూర్తయిన తర్వాత సీఎం రేవంత్, కేసీ వేణుగోపాల్‌ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకున్నారు. శాఖల కేటాయింపుపై చర్చించిన అంశాలను ఆయనకు వివరించారు. శాఖలకు సంబంధించి ఖర్గే కొన్ని మార్పులు చేర్పులను సూచించినట్లు తెలిసింది. కాసేపటికి రాహుల్‌ కూడా అక్కడకు చేరుకున్నారు. రాత్రి పొద్దుపోయేవరకు భేటీ కొనసాగింది. ఈ భేటీలో శాఖల కేటాయింపుపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. ఇక ఖర్గేతో భేటీ అనంతరం సీఎం రేవంత్‌, మంత్రి పొంగులేటి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.

సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్.. ఒక్కరే పార్లమెంట్‌కు వెళ్లారు. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను కలిసి ఎంపీ పదవికి రాజీనామా లేఖను సమర్పించారు. ఆ రాజీనామాను స్పీకర్‌ ఆమోదించారు. పలువురు ఎంపీలు రేవంత్‌కు పార్లమెంట్‌లో వీడ్కోలు పలికారు. తర్వాత పార్లమెంట్‌ నుంచి ముఖ్యమంత్రి తన నివాసానికి చేరుకున్నారు.

Jyothi

Jyothi

Next Story