Nagarjuna Sagar: ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్‌ అధినేత ప్లాన్..?

CM KCR Plan to Win in Nagarjuna Sagar By-Elections
x

సీఎం కెసిఆర్ (ఫైల్ ఫోటో)

Highlights

Nagarjuna Sagar: సాగర్‌లో గెలుపుపై కేసీఆర్ ప్రచారాన్ని మానిటరింగ్ చేస్తున్నారు

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్‌ అధినేత ప్లాన్ ఏంటి..?. దుబ్బాక ఓటమిని గుర్తు చేసుకుంటూ.. సాగర్‌లో గెలుపుపై కేసీఆర్ ప్రచారాన్ని మానిటరింగ్ చేస్తున్నారు. ఇతర పార్టీలో ఉన్న.. అసంతృప్తులను టీఆర్ఎస్‌లోకి చేర్చుకోవడం ద్వారా గెలుపు సాధ్యం అని భావిస్తున్నారా..?. ఇంతకు సాగర్ బైపోల్‌పై కేసీఆర్ ఎన్నికల స్ట్రాటజీ ఏంటి..?

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై బీజేపీ వ్యూహం బెడిసికొట్టిందన్న ప్రచారం జరుగుతోంది టీఆర్ఎస్‌లో. ఆఖరి నిమిషంలో టీఆర్ఎస్‌ టికెట్ ఆశించి భంగపడ్డ వ్యక్తుల్లో ఒకరికి తమ పార్టీ కండువాకప్పి పోటీలోకి దింపాలని బీజేపీ ఆలోచించింది. కానీ టీఆర్ఎస్‌ టికెట్ నోముల భగత్‌కు కేటాయించడం పట్ల ఎలాంటి అసంతృప్తి చెలరేగలేదు. సీఎం కేసీఆర్ నుంచి బీ ఫామ్‌ తీసుకునే సమయంలో మరియు నామినేషన్‌ వేసే సమయంలో టికెట్ ఆశించినవారు ముందుండి భగత్‌ను నడిపించారు. టీఆర్ఎస్‌ పార్టీలో అసంతృప్తి లేదనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు గులాబీ బాస్‌ కేసీఆర్.

లంబాడీల ఓట్లే లక్ష్యంగా రవి నాయక్‌కు బీజేపీ టికెట్ కేటాయించింది. కానీ ముందు నుంచి నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా కంకణాల నివేదితారెడ్డి ప్రచారం చేసుకున్నారు. మరోనేత కడారి అంజయ్య యాదవ్ బీజేపీ టికెట్ తనకు వస్తుందని ఆశపడ్డారు. కానీ చివరి క్షణంలో బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన బీజేపీ ఆశావహులు.. టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ ప్లాన్ వర్కౌట్ అయ్యింది. అధినేత ఆలోచన ప్రకారం గెలుపు వన్‌సైడ్ ఉండాలని నేతలకు సూచించారు పార్టీ అధినేత.గతంలో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదిలాబాద్ ఎంపీ సొయం బాపురావు ప్రధాని మోడీని కలిసిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో.. టీఆర్ఎస్‌ పార్టీ సోషల్ మీడియాతో పాటు అదే విషయాన్ని లంబాడీల ఓట్లు ఉన్న చోట ప్రచారం చేయాలని నేతలకు సీఎం కేసీఆర్ సూచనలు చేశారట.

గెలుపు కోసం ఇప్పటికే ప్రచారంలో ఉన్న నేతలతో ప్రతి రోజు ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు గులాబీ బాస్. ప్రభుత్వ పథకాలపై దృష్టి పెట్టడంతో పాటు... ప్రచారంలో అందరినీ కలుపుకొని పోవాలని ఇన్‌ఛార్జ్‌ నేతలకు సూచించారట అధినేత కేసీఆర్.

ఇక కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో బలహీనపడటంతో నాగార్జునసాగర్‌లో గెలిచినా.. ప్రయోజనం లేదనే విషయాన్ని ప్రచారంలో గట్టిగా విన్పిస్తున్నారట. సీఎం కేసీఆర్ ఉప ఎన్నికలపై సర్వే కూడా చేపించారట. నోముల భగత్ దాదాపు 30వేల మెజార్టీతో గెలుస్తారని రిపోర్ట్ ఇచ్చారట. లోకల్‌గా ఉన్న సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని.. ప్రచారంపై ఫోకస్‌ పెట్టనున్నారు కారు పార్టీ నేతలు. బీసీ సామాజిక ఓట్లు ఉన్న ప్రాంతాల్లో బీసీ నేతలతో. మిగతా కులాల ఓట్లు ఉన్న చోట మంత్రులను, ఎమ్మెల్యేలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించనున్నారు.

ఏది ఏమైనా నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీ అధినేత సర్వే విధంగానే గెలుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. దుబ్బాక ఉప ఎన్నికలో మొదటగా అత్యధిక మెజార్టీతో టీఆర్ఎస్ గెలుస్తుందని భావించినా అక్కడ బీజేపీ గెలవడంతో సాగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే నాగార్జునసాగర్‌లో గెలుపుకోసం గులాబీ బాస్‌ బహిరంగసభ పెట్టనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories