దుబ్బాకలో కాషాయ జెండా : మిషన్‌ చాణక్య ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే

దుబ్బాకలో కాషాయ జెండా : మిషన్‌ చాణక్య ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే
x
Highlights

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం రాజకీయ వ్యూహాలకు అందనివిధంగా రానుందా? 2018లో భారీ మెజారిటీతో దక్కించుకున్న సీటును గులాబీ పార్టీ జార విడుచుకోబోతోందా? దుబ్బాకలో తొలిసారి కమలం వికసించబోతోందా?

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం రాజకీయ వ్యూహాలకు అందనివిధంగా రానుందా? 2018లో భారీ మెజారిటీతో దక్కించుకున్న సీటును గులాబీ పార్టీ జార విడుచుకోబోతోందా? దుబ్బాకలో తొలిసారి కమలం వికసించబోతోందా? హోరా హోరీగా జరిగిన పోరులో కారు వెనుకబడిందా? ప్రముఖ సర్వే సంస్థ మిషన్‌ చాణక్య ఇదే చెబుతోంది. దుబ్బాకలో కాషాయ జెండా ఎగురబోతోందని మిషన్‌ చాణక్య ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే అంచనా వేసింది.

మండలాల వారీగా..పార్టీల వారీగా తెచ్చుకోనున్న ఓట్ల సంఖ్యపై కూడా అంచనాలు వేసింది. అయితే ప్రతి పార్టీకి వస్తాయని అంచనా వేసిన ఓట్లలో 6.53 శాతం తేడా ఉండొచ్చని ముందుగానే తెలియచేసింది మిషన్‌ చాణక్య. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ 9,789 ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని ఆ సంస్థ అంచనా వేసింది. అధికార టీఆర్‌ఎస్‌కు 66,150 ఓట్లు..బీజేపీకి 75,939 ఓట్లు..కాంగ్రెస్‌కు 19,193 ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలియచేసింది. ఇతర పార్టీలు, స్వతంత్రులకు కేవలం 766 ఓట్లు మాత్రమే వస్తాయంది.

నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 1,97, 646 కాగా...82 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే 1,62, 048 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి. ఒక్క రాయపోలు మండలంలోనే బీజేపీ కంటే టీఆర్‌ఎస్‌ స్వల్పంగా.. 228 ఓట్ల ఆధిక్యం తెచ్చుకోగలుగుతోందని మిషన్‌ చాణక్య అంచనా వేసింది. మిగిలిన ఆరు మండలాల్లోనూ బీజేపీకే మెజారిటీ వస్తుందని తెలిపింది. కాంగ్రెస్‌ పార్టీ అతికష్టం మీద డిపాజిట్టు తెచ్చుకుంటుందని సర్వే వివరించింది.

పార్టీల వారీగా ఓట్ల వాటాను గమనిస్తే..బీజేపీకి 47.01 శాతం...టీఆర్‌ఎస్‌కు 40.48 శాతం...కాంగ్రెస్‌కు 12.15 శాతం ఓట్లు పోలయినట్లు సర్వేలో తేలిందని మిషన్‌ చాణక్య తెలిపింది. ఆరు మండలాల్లో ఆధిక్యం సాధించిన బీజేపీకి 1.5 శాతం నుంచి 15 శాతం వరకు టీఆర్‌ఎస్‌పై మెజారిటీ ఓట్లు తెచ్చుకునే అవకాశం ఉందని సర్వే తెలిపింది. ఒక్క రాయపోలు మండలంలో మాత్రమే టీఆర్‌ఎస్‌కు 1.37 శాతం ఆధిక్యం ఉన్నట్లు తమ సర్వేలో తేలిందని ఆ సంస్థ వివరించింది.

పార్టీల వారీగా వచ్చిన ఓట్లలో 6.53 శాతం అటూ ఇటూగా ఉంటే ఒక అంచనా వేసిన మిషన్‌ చాణక్య....16.15 శాతం తేడాతో మరో అంచనా వేసింది. దీని ప్రకారం బీజేపీకి 51.82 శాతం ఓట్లు రావచ్చని తెలిపింది. టీఆర్‌ఎస్‌కు 35.67 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఇక కాంగ్రెస్‌ 12.15 శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది మిషన్‌ చాణక్య.


Show Full Article
Print Article
Next Story
More Stories