తెలంగాణలో రేపట్నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

Sumitra
Published on: 8 Oct 2020 1:10 PM IST
తెలంగాణలో రేపట్నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
X

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే దసరా పండగ వచ్చిందంటే చాలు తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. అదే క్రమంలో ఈ ఏడాది కూడా ప్రభుత్వం చీరలను మహిళలకు అందించనుంది. ఇక రాష్ట్రంలో కరోనా ఉన్నప్పటికీ ఈ పంపిణీకి బ్రేక్ వేయకుండా రేపటి నుంచే మొదలుకుని 11వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన కోటి మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ఇవ్వనున్నారు. అయితే ఇప్పటికే 287 డిజైన్లలో మగ్గాలపై చేసిన చీరలు 33 జిల్లాలకు చేరాయి. జిల్లాల్లో 98.50 లక్షల చీరలు అవసరమవుతాయని అంచనా వేసిన ప్రభుత్వం అన్ని చీరలను జిల్లాలకు చేరవేశారు.

కరోనా నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులే ఇంటింటికీ వెళ్లి చీరలను అందజేయనున్నారు. అప్పుడు తీసుకోలేని వారికి 12 నుంచి 15 వ తేదీ లోగా రేషన్‌ దుకాణాల ద్వారా చీరలు పంపిణీ చేస్తారు. అయితే ఈ చీరల పంపిణీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరమగ్గ నేతన్నలకు ఉపాది కల్పించటం..అదే సమయంలో అడపడుచులకు చిరు కానుక అందించటమే అని ప్రభుత్వం చెబుతుంది. ఈ ఏడాది ఈ చీరల తయారికి ప్రభుత్వం సుమారుగా రూ.317 కోట్లు ఖర్చు చేసింది. ఈ బతుకమ్మ చీరలను ప్రభుత్వం సిరిసిల్ల, గర్షకుర్తి, వరంగల్ లో మరమగ్గాలపై చీరలను తయారు చేయించింది.

ఇక ఈ చీరెల పంపిణీ పథకాన్ని శుక్రవారం మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరెలు అందించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని వార్డుల వారీగా విభజించి, చీరెలు పంపిణీ చేయనున్నారు.

Sumitra

Sumitra

Next Story