ఒక్క నిమిషంలో 'పోల్' ఎక్కింది..తెలంగాణలో తొలి జూనియర్ లైన్ ఉమెన్ గా రికార్డు కొట్టేసింది!

పట్టుదలతో ఉద్యోగం సాధించిన శిరీష. 18 అడుగుల పోల్ ను కేవలం ఒక్క నిమిషంలో ఎక్కి విజయం సాధించిన శిరీష

Sandeep Eggoju
Published on: 7 Jan 2021 10:15 AM IST
A 20 years girl gets job as junior woman lineman in Telangana
X

Sirisha a 20 years girl climbing 14 feet electric poll to get job

మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. పురుషులతో పోలిస్తే తాము ఎందులోనూ తీసిపోమని నిరూపిస్తున్నారు. సైన్యంలోనైనా.. విమానాలు నడపడంలోనైనా.. పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. మహిళలు చేయలేని పనంటూ లేదు ఇప్పుడు. సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలం గణేశపల్లికి చెందిన 20 ఏళ్ల యువతి.. తెలంగాణలో తొలి మహిళా లైన్ ఉమెన్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం గణేష్ పల్లికి చెందిన శిరీషది పేద కుటుంబం. కుటుంబానికి ఆసరాగా నిలవాలనేది 20 ఏళ్ల శిరీష సంకల్పం. ఐటీఐలో ఎలక్ర్టీషియన్‌ ట్రేడ్‌ పూర్తి చేసింది.

గత ఏడాది నవంబర్‌ చివర్లో లైన్‌మేన్‌ ఉద్యోగాల కోసం టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సంస్థ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టులు పురుషులకు మాత్రమేననీ, మహిళలకు అర్హత లేదనీ విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో శిరీషతో పాటు మరో 34 మంది మహిళలు హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు ఆదేశాలతో మహిళల దరఖాస్తులు స్వీకరించి పరీక్షకు అనుమతి ఇచ్చింది టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌. పురుష అభ్యర్థుల రాత ఫలితాలను విడుదల చేసిన టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ మహిళల ఫలితాలను నిలిపివేసింది.దీంతో శిరీష, మిగిలిన మహిళా అభ్యర్థులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. అర్హులైన మహిళా అభ్యర్థుల ఫలితాలను విడుదల చేయాలనీ, వారికి పోల్‌ టెస్ట్‌ నిర్వహించాలనీ హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను ఆ సంస్థ పట్టించుకోలేదు.

హైకోర్టు బెంచీకి మరోసారి శిరీష వెళ్ళాల్సి వచ్చింది. పదిహేను రోజుల్లోగా మహిళా అభ్యర్థులకు పోల్‌ టెస్ట్‌ జరపాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో గత డిసెంబర్ 23న శిరీషకూ, మరో మహిళా అభ్యర్థికీ అధికారులు పోల్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఈ పరీక్షలో ఒకటిన్నర నిమిషాల్లో విద్యుత్‌ స్తంభం ఎక్కి దిగాలి. ఒక్క నిమిషంలో పోల్‌ ఎక్కిన శిరీష జూనియర్‌ లైన్‌ ఉమన్‌గా ఎంపికయ్యారు.

తెలంగాణలో తొలి మహిళ లైన్ ఉమెన్‌గా శిరీష చరిత్ర సృష్టించింది. ఎంతో పట్టుదలతో ఈ ఉద్యోగం సాధించిన ఆమె ఆనందం వ్యక్తం చేస్తుంది. పోస్టింగ్ ఆర్డర్స్ కోసం ఎదురుచూస్తుంది. శిరీష లైన్ ఉమెన్‌గా సెలెక్ట్ కావడంతో ఇప్పటి వరకూ 'జూనియర్‌ లైన్‌మన్‌' గా ఉన్న పోస్ట్‌ పేరు ఇకపై 'జూనియర్‌ లైన్‌ ఉమన్‌' గానూ వాడుకలోకి రాబోతోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story