Sim Binding Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్.. వాట్సాప్ వాడే వారికి షాక్!

Sim Binding Rules: దేశంలో సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్రం సిమ్ బైండింగ్ నిబంధనలు తెచ్చింది. ఫిబ్రవరి 28 తర్వాత ఫోన్‌లో సిమ్ లేకపోతే వాట్సాప్ పనిచేయదు.
x

Sim Binding Rules (Gemini AI Image) 

Highlights

దేశంలో సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్రం సిమ్ బైండింగ్ నిబంధనలు తెచ్చింది. ఫిబ్రవరి 28 తర్వాత ఫోన్‌లో సిమ్ లేకపోతే వాట్సాప్ పనిచేయదు. పూర్తి వివరాలు ఇక్కడ.

Sim Binding Rules: దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్లలో మెసేజింగ్ యాప్‌ల వినియోగానికి సంబంధించి 'సిమ్ బైండింగ్' (SIM Binding) నిబంధనలను అమలు చేయడానికి ఫిబ్రవరి 28వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం ఈ గడువును పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీనివల్ల మార్చి 1, 2026 నుండి వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌ల వినియోగంలో కీలక మార్పులు రానున్నాయి.

ఏమిటీ సిమ్ బైండింగ్(Sim Binding Rules) నిబంధన?

సాధారణంగా మనం ఒక ఫోన్‌లో వాట్సాప్ ఖాతాను క్రియేట్ చేసిన తర్వాత, ఆ ఫోన్ నుండి సిమ్ కార్డును తీసివేసినా వైఫై (Wi-Fi) సహాయంతో యాప్‌ను వాడుకోవచ్చు. కానీ కొత్త నిబంధన ప్రకారం, మీ మొబైల్ ఫోన్‌లో భౌతిక సిమ్ కార్డ్ (Physical SIM) ఉంటేనే మెసేజింగ్ యాప్‌లు పనిచేస్తాయి. సిమ్ కార్డును తీసివేస్తే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లు వెంటనే నిలిచిపోతాయి.

ఈ విధానం వల్ల హ్యాకర్లు లేదా సైబర్ మోసగాళ్లు మీ నంబర్‌ను వారి పరికరాల్లో అక్రమంగా ఉపయోగించడం అసాధ్యం అవుతుంది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని, డిజిటల్ మోసాలను నివారించడానికి ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. భద్రతా పరమైన అంశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది.

డెస్క్‌టాప్ వినియోగదారులకు కొత్త రూల్:

కంప్యూటర్లు లేదా లాప్‌టాప్‌లలో వాట్సాప్ వెబ్ వాడే వారికి కూడా కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఇకపై కంప్యూటర్లలో లాగిన్ అయిన ఆరు గంటల తర్వాత ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అయిపోతుంది. దీనివల్ల ఆఫీసుల్లో లేదా బయటి ప్రాంతాల్లో పొరపాటున లాగిన్ వదిలేసినా సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా రక్షణ లభిస్తుంది. అయితే, ఈ ఆరు గంటల నిబంధన నిపుణులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుందని పరిశ్రమల సంఘం (IAMAI) ఆందోళన వ్యక్తం చేసింది.

వాట్సాప్ మాత్రమే కాకుండా స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, జోష్ వంటి ఇతర మెసేజింగ్ అలాగే సోషల్ మీడియా యాప్‌లు కూడా ఈ పరిధిలోకి వస్తాయి. మార్చి 1 నుండి వినియోగదారులు తమ రిజిస్టర్డ్ సిమ్ కార్డును అదే ఫోన్‌లో ఉంచుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో యాప్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది.

కంపెనీలపై చర్యలు తప్పవు :

Sim Binding Rules: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలను టెక్ కంపెనీలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనల అమలుపై కంపెనీలు 120 రోజుల్లోపు నివేదికను సమర్పించాలి. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023, టెలికాం సైబర్ భద్రతా నియమాల ప్రకారం భారీ జరిమానాలు లేదా ఇతర కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

వినియోగదారులు సైబర్ భద్రత పట్ల అవగాహన పెంచుకోవాలని, ప్రభుత్వ నిబంధనలకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఈ కొత్త మార్పుల వల్ల ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories