పుకార్లకు ఫుల్‌స్టాప్.. అధికారికంగా విడిపోయిన యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడిపోతున్నారంటూ గత కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేశాయి. అయితే వాటిని నిజం చేస్తూ ఇద్దరూ అధికారికంగా విడిపోయారు.

Vijaya Laxmi
Published on: 21 Feb 2025 11:13 AM IST
Yuzvendra Chahal and Dhanashree officially divorced
X

పుకార్లకు ఫుల్‌స్టాప్.. అధికారికంగా విడిపోయిన యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ

Yuzvendra Chahal and Dhanashree divorced: టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడిపోతున్నారంటూ గత కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేశాయి. అయితే వాటిని నిజం చేస్తూ ఇద్దరూ అధికారికంగా విడిపోయారు. విడాకులకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ పూర్తికావడంతో వారి వివాహ బంధం ముగిసింది.

అంతా ఊమించినట్టే చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. చాహల్, ధనశ్రీ వర్మ 2020లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. ఇటీవల వీరు విడిపోతున్నట్టు వార్తలు వచ్చినా ఇద్దరూ స్పందించలేదు. దీంతో వీరిద్దరూ విడిపోతారంటూ అంతా భావించారు. అనుకున్నట్టు అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

చాహల్, ధనశ్రీ వర్మ గురువారం ముంబై బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. మొదట ఇద్దరికి 45 నిమిషాల పాటు కౌన్సెలింగ్ ఇచ్చిన జడ్జి విడిపోవడానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇప్పటికీ మీరు విడిపోవాలని అనుకుంటున్నారా..? అని అడగగా ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతున్నట్టు వెల్లడించారు. దీంతో జడ్జి చాహల్-ధనశ్రీ విడాకులకు ఆమోదం తెలిపారు.

సుమారు 18 నెలల నుంచి చాహల్, ధనశ్రీ వేర్వేరుగా ఉన్నారని జడ్జి తెలిపారు. కొన్ని నెలల క్రితం చాహల్, ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఆ తర్వాత చాహల్ తన భార్యతో ఉన్న అన్ని ఫొటోలను కూడా సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించాడు. ఆ తర్వాత ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ పేరు నుంచి చాహల్‌ను తొలగించింది. ఇక విడాకుల వార్తలకు బలం చేకూరుస్తూ యుజ్వేంద్ర చాహల్ ఒక పోస్టులో కొత్త జీవితంలో లోడింగ్ అని పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ అధికారికంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత ధనశ్రీ వర్మకు యుజ్వేంద్ర చాహల్ రూ.60 కోట్ల భరణం ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. విడాకుల తర్వాత ధనశ్రీ సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ మనం పడే బాధలు, ఎదుర్కొనే పరీక్షలను కొన్నాళ్ల తర్వాత దేవుడు ఆశీర్వాదాలుగా మార్చగలడని తెలిపారు. మీరు ఈ రోజు ఏదైన విషయం గురించి ఒత్తిడి, ఆందోళనకు గురైతే మీకు మరో అవకాశం ఉందన్న విషయం తెలుసుకోండి. బాధలను మర్చిపోయి దేవుడిని ప్రార్థించండి. ఆయనపై మీకున్న విశ్వాసమే మీకు మంచి జరిగేలా చేస్తుంది అని ధనశ్రీ రాసుకొచ్చారు. ఒత్తిడి నుంచి ఆశీర్వాదం అని క్యాప్షన్ పెట్టారు. ఇక చాహల్ కూడా తన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. నేను లెక్కించలేనన్ని సార్లు దేవుడు నన్ను రక్షించాడు. ఆ సమయాలను ఊహించగలను కానీ అవేంటో తెలియవు. ఎప్పుడూ నాతో ఉన్న దేవుడికి ధన్యవాదాలు. ఆమెన్ అని రాసుకొచ్చారు.


Vijaya Laxmi

Vijaya Laxmi

Next Story