4th Test India Vs England: అది స్పిన్ ల్యాండ్..పిచ్ లు అలానే ఉంటాయి: వివియన్‌ రిచర్డ్స్

4th Test India Vs England: మొతేరా పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా మారడం నాకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదని వివియన్‌ రిచర్డ్స్ వెల్లడించాడు.

Venkata Chari
Published on: 1 March 2021 3:01 PM IST
Vivian Richards Comments on Motera Pitch
X

వివియన్‌ రిచర్డ్స్ (ఫోటో ఫేస్‌బుక్)

4th Test India Vs England: మొతేరా పిచ్ పై చర్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇలాంటి విషయాలపై స్పందించిన వెస్టిండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్.. అహ్మదాబాద్‌ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా మారడం నాకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదని అన్నాడు. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్లు మొతేరా పిచ్‌ గురించి మాట్లాడటం మానుకోవాలని, అక్కడ ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా సిద్ధపడాలని హితవు పలికాడు.

''ఇండియా- ఇంగ్లండ్‌ మధ్య జరిగిన 2వ, 3వ టెస్టు గురించి ఈ మధ్య కాలంలో అనేక ప్రశ్నలు ఎదుర్కొన్నాను. పిచ్‌ గురించి విమర్శలు కురిపిస్తున్న మాజీలు పరిస్థితులను అర్థం చేసుకోవాలి. టెస్టు మ్యాచ్‌లో ఏదైనా జరగొచ్చు. నిజానికి ఇంగ్లాండ్ టీం ఎక్కడ ఆడుతుందో గుర్తుపెట్టుకోవాలి. భారత్‌ అంటేనే స్పిన్‌ లాండ్‌ అని అర్థం చేసుకోవాలి. అక్కడ పిచ్‌లు అలానే ఉంటాయి. ఇండియాను ఓడించేందుకు చక్కని ప్రణాళికలు రూపొందించుకోవాలి. పిచ్‌ గురించి అతిగా ఆలోచించడం మానుకొని, ఆటపై శ్రద్ధ పెడితే మంచిది'' అని ఫేస్‌బుక్‌ వీడియోలో రిచర్డ్స్‌ వెల్లడించాడు.

నాలుగో టెస్టు కూడా అక్కడే జరుగుతుంది కాబట్టి, అదే పిచ్‌ను తయారు చేయాలని ఇండియాకు విజ్ఞప్తి చేశాడు. పిచ్‌ను అంచనా వేసేందుకు ఇంగ్లండ్‌కు మంచి అవకాశం దొరికింది. 4వ టెస్ట్ ఎలా ఉండబోతోందో ఇంగ్లాండ్ కి అర్థమయిందని రిచర్డ్స్‌' పేర్కొన్నాడు. కాగా మార్చి 4 నుంచి అహ్మదాబాద్‌లో 4వ టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచులో గెలిచేందుకు ఇరు జట్లు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి.


Venkata Chari

Venkata Chari

Next Story