
Vijay Hazare Trophy 2025 : భారతీయ గడ్డపై దేశవాళీ క్రికెట్ పండగ విజయ్ హజారే ట్రోఫీ (2025-26) అద్భుతమైన రీతిలో మొదలైంది.
Vijay Hazare Trophy 2025: భారతీయ గడ్డపై దేశవాళీ క్రికెట్ పండగ విజయ్ హజారే ట్రోఫీ (2025-26) అద్భుతమైన రీతిలో మొదలైంది. టోర్నీ ఆరంభమైన తొలి రోజే (డిసెంబర్ 24) బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఏకంగా 22 మంది బ్యాటర్లు సెంచరీలు బాది కొత్త చరిత్ర సృష్టించారు. టీమ్ ఇండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత దేశవాళీ వన్డే బరిలోకి దిగి సెంచరీలతో విరుచుకుపడటంతో ఫ్యాన్స్కు కనువిందు కలిగింది. అయితే ఇంతమంది స్టార్లు ఉన్నా, ఒక అన్నోన్ ప్లేయర్ డబుల్ సెంచరీతో అందరినీ వెనక్కి నెట్టి నంబర్-1గా నిలిచాడు.
చాలా ఏళ్ల విరామం తర్వాత విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పాత రోజులను గుర్తు చేశారు. ముంబై తరపున ఆడుతున్న రోహిత్ శర్మ.. సిక్కింపై కేవలం 62 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, మొత్తంగా 155 పరుగులు పిండుకున్నాడు. మరోవైపు ఢిల్లీ జట్టుకు ఆడుతున్న విరాట్ కోహ్లీ.. ఆంధ్ర జట్టుపై 131 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి తన క్లాస్ చూపించాడు. వీరిద్దరూ సెంచరీలతో ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించారు.
నిన్న అసలైన విధ్వంసం బీహార్, అరుణాచల్ ప్రదేశ్ మ్యాచ్లో జరిగింది. బీహార్ జట్టు 50 ఓవర్లలో ఏకంగా 574 పరుగులు చేసి లిస్ట్-ఏ క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇందులో 14 ఏళ్ల సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది, అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ప్లేయర్గా నిలిచాడు. మరోవైపు బీహార్ కెప్టెన్ సకిబుల్ గని కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, భారత్ తరపున ఫాస్టెస్ట్ లిస్ట్-ఏ సెంచరీ రికార్డును తన పేరు రాసుకున్నాడు. జార్ఖండ్ తరపున ఆడిన ఇషాన్ కిషన్ కూడా ఏమాత్రం తగ్గకుండా 33 బంతుల్లోనే సెంచరీ బాదాడు.
స్టార్లు అంతా సెంచరీలు బాదితే, ఒడిశాకు చెందిన స్వాస్తిక్ సామల్ మాత్రం ఏకంగా డబుల్ సెంచరీతో టాప్ లేపాడు. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో స్వాస్తిక్ 169 బంతుల్లో 212 పరుగులు చేసి తొలి రోజు టాప్ స్కోరర్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 21 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అయితే విచారకరమైన విషయం ఏంటంటే.. స్వాస్తిక్ ఇంతటి భారీ స్కోరు చేసినా, సౌరాష్ట్ర బ్యాటర్లు ఆ టార్గెట్ను చేజ్ చేసి ఒడిశాపై గెలిచారు. స్వాస్తిక్ పోరాటం వృథా అయినా, అతని డబుల్ సెంచరీ మాత్రం క్రికెట్ లోకంలో చర్చనీయాంశంగా మారింది.
మొదటి రోజు వీరే కాకుండా అర్పిత్ భతేవరా, రికీ భుయ్, యశ్ దూబే, సమ్మర్ గజ్జర్, విష్ణు వినోద్, ధ్రువ్ షోరే వంటి మొత్తం 22 మంది ఆటగాళ్లు సెంచరీలు బాదారు. భారత క్రికెట్ చరిత్రలో ఒకే రోజు ఇన్ని సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో డిసెంబర్ 24వ తేదీ ఒక గోల్డెన్ డేగా మిగిలిపోనుంది. టీమ్ ఇండియా సీనియర్ ప్లేయర్లు, యంగ్ బ్లడ్ కలిసి చేసిన ఈ రికార్డుల వేట భారత క్రికెట్ భవిష్యత్తుపై భరోసానిస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




