Tilak Varma : ప్రాణాంతక వ్యాధి బారిన తిలక్ వర్మ..వారి వల్లే ప్రాణాలు దక్కాయట

టీమిండియా యువ సంచలనం, ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ను గెలిపించిన హీరో తిలక్ వర్మ తన జీవితంలో జరిగిన ఒక షాకింగ్ సీక్రెట్ బయటపెట్టారు.

CR Reddy
Published on: 24 Oct 2025 11:30 AM IST
Tilak Varma : ప్రాణాంతక వ్యాధి బారిన తిలక్ వర్మ..వారి వల్లే ప్రాణాలు దక్కాయట
X

Tilak Varma : ప్రాణాంతక వ్యాధి బారిన తిలక్ వర్మ..వారి వల్లే ప్రాణాలు దక్కాయట

Tilak Varma : టీమిండియా యువ సంచలనం, ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ను గెలిపించిన హీరో తిలక్ వర్మ తన జీవితంలో జరిగిన ఒక షాకింగ్ సీక్రెట్ బయటపెట్టారు. మూడు సంవత్సరాల క్రితం, ఒక ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడి దాదాపు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నానని ఆయన తెలిపారు. అయితే, ఆ సమయంలో ఆకాష్ అంబానీ, జై షా చూపించిన చొరవ, తక్షణ సహాయం కారణంగానే తాను ప్రాణాలతో బయటపడ్డానని, లేదంటే ఈ రోజు క్రికెట్ ఆడటం సాధ్యమయ్యేది కాదని తిలక్ వర్మ వెల్లడించారు. గౌరవ్ కపూర్ నిర్వహించే బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ షోలో తిలక్ తన జీవితంలోని ఆ భయంకరమైన ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు.

తిలక్ వర్మ 2022 సంవత్సరంలో ఇండియా ఎ జట్టుతో కలిసి బంగ్లాదేశ్‌లో సిరీస్ ఆడుతున్నప్పుడు ఈ భయంకరమైన సంఘటన జరిగింది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తాను రబ్డోమయోలిసిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారిన పడినట్లు తిలక్ వర్మ తెలిపారు. ఈ వ్యాధిలో శరీరంలోని కండరాలు చిరిగిపోవడం మొదలవుతుంది. దీని కారణంగా మయోగ్‌లోబిన్ అనే రసాయనం రక్తంలోకి ప్రవేశించి, నేరుగా కిడ్నీలను దెబ్బతీస్తుంది.

ఆ సమయంలో తాను సెంచరీకి దగ్గరవుతున్నానని, అకస్మాత్తుగా కళ్లలో నొప్పి మొదలైందని తిలక్ వివరించారు. తన వేళ్లు పని చేయడం ఆగిపోయాయని, తన శరీరం అంతా బిగుసుకుపోయి రాయిలా మారిపోయినట్లు అనిపించిందని ఆ భయంకరమైన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఆరోగ్యం విషమించడంతో తిలక్ వర్మ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఆ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆయనే వివరించారు.

"నా చేతులు వంగడం లేదు, వేళ్లు కూడా కదల్లేదు. నా చేతులకు ఉన్న గ్లవ్స్‌ను కత్తిరించి తీయాల్సి వచ్చింది. అంతగా నా ఆరోగ్యం చెడిపోయింది" అని తిలక్ వర్మ తెలిపారు. ఆ ప్రాణాంతక పరిస్థితి నుంచి బయటపడటానికి ఆకాష్ అంబానీ, బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన సహాయాన్ని తిలక్ వర్మ కొనియాడారు.

తన ఆరోగ్యం విషమించిందని తెలియగానే, తన ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ ఓనర్ అయిన ఆకాష్ అంబానీ వెంటనే స్పందించారు. అప్పటి బీసీసీఐ కార్యదర్శి జై షాకు ఫోన్ చేసి, తన పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరి ప్రయత్నాల ద్వారానే తనకు వీలైనంత త్వరగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే అవకాశం దక్కిందని తిలక్ తెలిపారు. కొద్దిగా ఆలస్యమైనా ప్రాణాలు పోయే అవకాశం ఉండేదని డాక్టర్లు చెప్పారని తిలక్ వర్మ వెల్లడించారు. ఆ రోజు వారు చూపిన చొరవ వల్లే ఈ రోజు తాను దేశం తరఫున క్రికెట్ ఆడగలుగుతున్నానని వారికి కృతజ్ఞతలు తెలిపారు.

CR Reddy

CR Reddy

Next Story