Shikhar Dhawan: టీమిండియా 2 కెప్టెన్‌గా శిఖర్‌ ధవన్‌..?

Shikhar Dhawan: వచ్చే నెలలో టీమిండియా శ్రీలంకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే.

Venkata Chari
Updated on: 9 Jun 2021 10:30 PM IST
Team India New Captain Shikhar Dhawan For Sri Lanka Tour Says Reports
X

శిఖర్ ధవన్ (ఫొటో ట్విట్టర్)

Shikhar Dhawan: వచ్చే నెలలో టీమిండియా శ్రీలంకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విరాట్ సారథ్యంలోని మొదటి టీం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లగా, రెండో టీం శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనుంది. అయితే, రెండో టీం కు కెప్టెన్ గా ఎవరుంటారనే ప్రశ్న గత కొద్ది రోజులుగా నెట్టింట్లో తిరుగుతోంది. టీమిండియా సీనియర్ ప్లేయర్ శిఖర్ ధవన్‌కు ఆ ఛాన్స్ దక్కనుందని తెలుస్తోంది. ఈ మేరక పలు రిపోర్టులు కూడా ధవన్‌ నే ప్రకటించనున్నారని వెల్లడించాయి.

ఇప్పటి వరకు వైస్‌ కెప్టెన్‌‌గా వ్యవహరించిన శిఖర్ ధవన్.. శ్రీలంక టూర్‌లో ఫుల్ టైం కెప్టెన్‌గా ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కెరీర్‌లో తొలిసారి మెన్‌ ఇన్‌ బ్లూ టీంకు సారథ్యం వహించే అవకాశం దక్కబోతోంది. ఈ మేరకు బీసీసీఐ కూడా నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయమై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఈ నెల చివర్లో కెప్టెన్‌ పేరును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

శ్రీలంక పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. లంక పర్యటనకు భారత బి జట్టుని సెలెక్టర్లు ఈనెల చివరి వారంలో ఎంపిక చేయనున్నారు. ఇందులో శిఖర్ ధవన్, పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, రాహుల్ చాహర్, రాహుల్ తెవాటియా తదితరులు ఉండనున్నారు.

జులై 13న భారత్, శ్రీలంక మధ్య తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభమవనుంది. జూన్‌ 16న రెండో వన్డే, 18న మూడో వన్డే‌ జరుగనుంది. అనంతరం జులై 21న తొలి టీ20.. జులై 23 న రెండోది, 25న మూడో టీ20 జరుగనున్నాయి. ఈ సిరీస్‌ లో భారత చీఫ్ కోచ్‌గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించబోతున్నాడు. మ్యాచ్‌లన్నీ కొలంబో వేదికగా జరగనున్నట్లు బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది.

Venkata Chari

Venkata Chari

Next Story