
T20 World Cup 2026 : వద్దంటే వద్దంటున్నారు..ఇండియాకు రాబోమంటున్న బంగ్లాదేశ్..వరల్డ్ కప్ లో అసలు మజా ఉండదా?
వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2026 కి ముందు క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనం నమోదైంది.
T20 World Cup 2026 : వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2026 కి ముందు క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనం నమోదైంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు క్రీడల మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తమ దేశ ఆటగాళ్లకు భారత్లో రక్షణ ఉండదని భావిస్తున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, వరల్డ్ కప్ ఆడేందుకు భారత్కు రాబోమని తేల్చి చెప్పింది. ఈ వివాదం ఇప్పుడు ఐసీసీ గడప తొక్కింది.
భారత్కు వచ్చేది లేదంటున్న బంగ్లాదేశ్
టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి మరో నెల రోజులే సమయం ఉన్న తరుణంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదివారం (జనవరి 4) అత్యవసరంగా సమావేశమైన బోర్డు డైరెక్టర్లు, ప్రస్తుత పరిస్థితుల్లో తమ జట్టును భారత్కు పంపకూడదని నిర్ణయించారు. తమ ఆటగాళ్లు, సిబ్బంది భద్రత దృష్ట్యా భారత్లో జరగాల్సిన తమ మ్యాచ్లను వేరే దేశానికి మార్చాలని ఐసీసీకి అధికారికంగా విన్నవించింది. ఒకవేళ భారత్లోనే మ్యాచ్లు నిర్వహిస్తే తాము టోర్నీ నుంచి తప్పుకోవడానికి కూడా వెనకాడబోమని సంకేతాలిచ్చింది.
ముస్తాఫిజుర్ వివాదమే చిచ్చు పెట్టిందా?
ఈ గొడవకు అసలు కారణం ఐపీఎల్ 2026. కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఎంపికైన బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ ఆదేశించింది. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారత్లో నిరసనలు మిన్నంటాయి. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా జనవరి 3న ముస్తాఫిజుర్ను విడుదల చేయాలని కోల్కతాకు బీసీసీఐ సూచించింది. ఈ నిర్ణయం బంగ్లాదేశ్ బోర్డుకు ఆగ్రహం తెప్పించింది. దీనికి ప్రతిచర్యగా వాళ్లు ఇప్పుడు వరల్డ్ కప్ను అడ్డుపెట్టుకుని కొత్త డిమాండ్లు తెరపైకి తెచ్చారు.
వేదికలు మారుతాయా? శ్రీలంకకు మ్యాచ్లు?
బంగ్లాదేశ్ విన్నపంపై ఐసీసీ చైర్మన్ జై షా స్పందించే అవకాశం ఉంది. క్రికబజ్ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ ఆడే గ్రూప్ మ్యాచ్లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చడంపై ఐసీసీ తీవ్రంగా ఆలోచిస్తోంది. టోర్నీకి సమయం తక్కువగా ఉండటంతో షెడ్యూల్లో మార్పులు చేయడం కష్టమైనప్పటికీ, బంగ్లాదేశ్ మొండి పట్టుదలతో ఉంటే శ్రీలంకలోని మూడు వేదికల్లో ఆ మ్యాచ్లు నిర్వహించే అవకాశం ఉంది. సోమవారం (జనవరి 5) ఐసీసీ కార్యాలయం పునఃప్రారంభమైన తర్వాత దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ప్రమాదంలో వరల్డ్ కప్ ఉత్సాహం
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ వరల్డ్ కప్ను నిర్వహిస్తున్నాయి. అయితే బంగ్లాదేశ్ మ్యాచ్లను పూర్తిగా శ్రీలంకకు తరలిస్తే అది టోర్నీ నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతుంది. టిక్కెట్ల అమ్మకాలు, ప్రసార హక్కులు, హోటల్ బుకింగ్స్పై ఇది నెగటివ్ ఇంపాక్ట్ చూపవచ్చు. పాకిస్థాన్ ఇప్పటికే భారత్కు రావడానికి ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఇదే బాట పట్టడం ఐసీసీకి పెద్ద తలనొప్పిగా మారింది. జై షా ఈ సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తారో అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




