Asia Cup 2025: సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన.. ఆసియా కప్ 2025కు టీమిండియా ప్లాన్ ఇదేనా?


Asia Cup 2025: సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన.. ఆసియా కప్ 2025కు టీమిండియా ప్లాన్ ఇదేనా?
ఆసియా కప్ 2025 ప్రారంభానికి కౌంట్డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 9 నుంచి మొదలయ్యే ఈ టోర్నమెంట్లో టీమిండియాను సూర్యకుమార్ యాదవ్ నడిపించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
Asia Cup 2025: ఆసియా కప్ 2025 ప్రారంభానికి కౌంట్డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 9 నుంచి మొదలయ్యే ఈ టోర్నమెంట్లో టీమిండియాను సూర్యకుమార్ యాదవ్ నడిపించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఫిట్నెస్ సమస్యలతో బాధపడిన సూర్యకుమార్ ఇప్పుడు పూర్తిగా ఫిట్గా ఉన్నాడు, కాబట్టి అతను టోర్నమెంట్కు అందుబాటులో ఉంటాడు. అయితే, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా కొనసాగినా, వైస్ కెప్టెన్ మాత్రం మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఆసియా కప్లో టీమిండియా టీ20 జట్టు వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ కనిపించడం దాదాపు ఖాయం. ఇంతకు ముందు టీమిండియా వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ వ్యవహరించగా, ఇప్పుడు అతని స్థానంలో గిల్ను టీ20 జట్టు వైస్ కెప్టెన్గా నియమించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
శుభ్మన్ గిల్ ఇప్పటికే టెస్ట్ జట్టుకు కెప్టెన్గా అరంగేట్రం చేశాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత వన్డే జట్టు కెప్టెన్సీ కూడా అతనికి దక్కే అవకాశం ఉంది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ను రాబోయే టీ20 ప్రపంచ కప్ వరకు కెప్టెన్గా కొనసాగించాలని నిర్ణయించారు. టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత టీ20 జట్టు కెప్టెన్ కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చే ఏడాది సూర్యకుమార్ యాదవ్కు 35 ఏళ్లు నిండుతాయి. కాబట్టి టీ20 ప్రపంచ కప్ తర్వాత యువ ఆటగాడికి కెప్టెన్ పదవి ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. అందుకోసమే ఇప్పుడు శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా నియమించాలని సెలక్షన్ కమిటీ భావిస్తోంది.
సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమయ్యే ఆసియా కప్లో భారత జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ సెలక్ట్ కావడం దాదాపు ఖాయం అని చెప్పవచ్చు. ఈ టోర్నమెంట్లో టీమిండియాకు సంబంధించిన మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ పరిశీలిస్తే..
భారత్ vs యూఏఈ: సెప్టెంబర్ 10 (దుబాయ్)
భారత్ vs పాకిస్థాన్: సెప్టెంబర్ 14 (దుబాయ్)
భారత్ vs ఒమన్: సెప్టెంబర్ 19 (అబుదాబి)
ఈ మూడు మ్యాచ్ల తర్వాత సూపర్-4 దశ మ్యాచ్లు జరుగుతాయి. అంటే, మొదటి రౌండ్లోని పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సూపర్-4 దశకు చేరుకుంటాయి. ఆ తర్వాత సూపర్-4 దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్లో తలపడతాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



