ENG vs IND: బర్మింగ్‌హామ్ టెస్టులో ధాటిగా రాణించిన టీమిండియా

ENG vs IND: సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్

Jyothi
Published on: 2 July 2022 6:35 AM IST
Rishabh Pant Blasts Second Fastest Century In T20 History
X

ENG vs IND: బర్మింగ్‌హామ్ టెస్టులో ధాటిగా రాణించిన టీమిండియా

ENG vs IND: ఇంగ్లాండుతో జరుగుతున్న బర్మింగ్‌హామ్ క్రికెట్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ధాటిగా ఆడుతోంది. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్లు శుభ్‌మన్‌గిల్‌ , ఛతేశ్వర పూజారా నిరాశపర్చారు. ఆతర్వాత హనుమవిహారి, విరాట్‌కోహ్లీ, శ్రేయస్‌అయ్యర్ వెంటవెంటనే పెవీలియన్ బాటపట్టారు. టాపార్టర్ కుప్పకూలడంతో పీకల్లోతు కష్టాల్లోపడిన భారత్‌ను రిషబ్ పంత్, రవీంద్ర జడేజా జోడీ ఇంగ్లాండ్ బౌలర్ల బంతుల్ని ధాటిగా ఎదుర్కొన్నారు. అడపాదడపా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. రిషబ్ పంత్ ఆరంభంనుంచే తనదైన శైలిలో బ్యాట్‌ను ఝుళిపించి జట్టుకు అండగా నిలిచారు. ఇంగ్లాండు బౌలర్లు ప్రమాదకరమైన బంతుల్ని సంధించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా... సమర్థవంతమైన ఆటతీరుతో బౌండరీలు, సిక్సర్లతో రిషబ్ పంత్ విరుచుకు పడ్డాడు. అద్భుతమైన ఆటతీరుతో సెంచరీ నమోదు చేశాడు. 111 బంతులు ఎదుర్కొన్న పంత్ 20 బౌండరీలు, నాలుగు సిక్సర్లతో 146 పరుగులు నమోదుచేశాడు. రవీంద్ర జడేజా జోడీ కుదరడంతో పరుగులు రాబట్టుకోవడంలో అద్భుతంగా రాణించారు. జడేజా, పంత్ జోడీ ఆరో వికెట్‌కు 222 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో పంత్ ఆటే హైలెట్‌గా నిలిచింది.

రవీంద్ర జడేజా 148 బంతులు ఎదుర్కొని 9 బౌండరీలతొ 69 పరుగులతో కొనసాగుతున్నాడు. పంత్ ఔటయ్యాక శార్థుల్ ఠాగూర్ 12 బంతులు ఎదుర్కొని ఒక పరుగుకే పరిమితమయ్యాడు. ఆతర్వాత మహ్మద్‌షమీ, జడేజాతో కలిసి స్కోరు బోర్డును చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. హనుమ విహారి 20 పరుగులు, శుభమన్‌గిల్ 17 పరుగులు, శ్రేయస్‌అయ్యర్ 15 పరుగులు అందించారు. ఛతేశ్వర పూజారా 13 పరుగులు, విరాట్ కోహ్లీ 11 పరుగులు నమోదు చేశారు. ఇంగ్లాండు బౌలర్లలో జేమ్స్ అండర్ సన్ మూడు వికెట్లు, మేటీ పాట్స్ రెండు వికెట్లు, కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ , జోయ్ రూట్ ఒక్కో వికెట్ నమోదు చేశారు. 67 ఓవర్ల ముగిసే సమయానికి టీమిండియా ఏడు వికెట్లను కోల్పోయి 324 పరుగులు నమోదు చేసింది.

Jyothi

Jyothi

Next Story