Pakistan Cricket: వర్షంలో మ్యాచ్, పాకిస్థాన్‌కు అన్యాయం జరుగుతోంది.. నాసర్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు!

Pakistan Cricket
x

Pakistan Cricket: వర్షంలో మ్యాచ్, పాకిస్థాన్‌కు అన్యాయం జరుగుతోంది.. నాసర్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు!

Highlights

Pakistan Cricket: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసాయి.

Pakistan Cricket: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసాయి. టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 మ్యాచ్‌ల షెడ్యూల్ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), భారత క్రికెట్ మండలి (బీసీసీఐ)పై విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ మ్యాచ్‌లను వర్షాలు ఎక్కువగా పడే శ్రీలంకలో పెట్టడం అన్యాయమని పేర్కొన్నాడు. పాకిస్థాన్ సెమీస్ చేరకుండానే నిష్క్రమించే అవకాశాలు ఉన్నాయని హుస్సేన్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 8 మొదటి మ్యాచులో ఒక్క బంతి పడకుండానే వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్లకు చెరో పాయింట్‌ దక్కింది.

పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో నాసర్ హుస్సేన్ విమర్శలు చేశాడు. 'కొలంబోలో వర్షాల కారణంగా మ్యాచ్‌లు రద్దయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కొలంబోలో మ్యాచులు ఆడుతోంది. వర్షాల కారణంగా సూపర్-8 దశలోనే పాక్ నిష్క్రమించే పరిస్థితి ఉంది. మరోవైపు భారత జట్టు మాత్రం వర్షాలు తక్కువగా ఉండే ఇండియాలోనే తమ మ్యాచ్‌లు ఆడుతోంది. ఇది సమాన అవకాశాల సూత్రానికి విరుద్ధం' అని హుస్సేన్ విమర్శించాడు. పాకిస్థాన్ కూడా భారత్‌లోనే మ్యాచ్‌లు ఆడేలా షెడ్యూల్ చేయాల్సిందని, లేదంటే టోర్నమెంట్ సమతుల్యత దెబ్బతింటుందని హుస్సేన్ పేర్కొన్నారు. ప్రపంచ క్రికెట్ సమగ్రతను కాపాడాలంటే.. షెడ్యూల్ నిర్ణయాల్లో పారదర్శకత అవసరమని ఆయన సూచించాడు.

అయితే నాసర్ హుస్సేన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ 2026కు భారత్ ఆతిధ్యం ఇస్తోందని నాసర్ హుస్సేన్ తెలుసుకోవాలని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్‌ రద్దు కావడం పాక్‌ సెమీస్‌ ఆశలపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. తర్వాతి మ్యాచ్‌ల్లో గెలవకపోతే పాక్ సెమీస్‌ ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉంది. సూపర్‌ 8లో పాకిస్థాన్‌ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. 24న ఇంగ్లాండ్‌తో, 28న శ్రీలంకతో పాక్ ఆడుతుంది. రెండు మ్యాచ్‌ల్లో పాక్‌ గెలిస్తే.. 5 పాయింట్లతో సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక మ్యాచ్‌లో ఓడినా.. పాక్ ఖాతాలో మూడు పాయింట్లే ఉంటాయి. అప్పుడు పాక్ ఇతర జట్ల ఫలితాలపై పాక్‌ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories