India vs England: క్యాచ్‌లు వదిలేసి మ్యాచ్ పోగొట్టుకున్న భారత్? పట్టు బిగిస్తున్న ఇంగ్లండ్!

India vs England: లీడ్స్‌లో జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆట పూర్తయ్యింది. ఈ రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ జట్టు మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది.

CR Reddy
Updated on: 22 Jun 2025 8:42 AM IST
India vs England
X

India vs England: క్యాచ్‌లు వదిలేసి మ్యాచ్ పోగొట్టుకున్న భారత్? పట్టు బిగిస్తున్న ఇంగ్లండ్!

India vs England: లీడ్స్‌లో జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆట పూర్తయ్యింది. ఈ రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ జట్టు మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. ఆట మొదట్లో మన భారత జట్టును 471 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్, రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తరఫున ఓపెనర్ బెన్ డకెట్ హాఫ్ సెంచరీ చేసి అవుట్ అవ్వగా, ఓలి పోప్ సెంచరీ కొట్టి, హ్యారీ బ్రూక్ తో కలిసి మూడో రోజుకు బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. భారత్ తరఫున జస్ ప్రీత్ బుమ్రా ఒక్కడే రాణించి 3 వికెట్లు పడగొట్టాడు.

చెత్త ఫీల్డింగ్

భారత జట్టును 471 పరుగులకే ఆలౌట్ చేసి బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం దక్కలేదు. ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా మొదటి ఓవర్‌లోనే జ్యాక్ క్రౌలీని అవుట్ చేశాడు. దాంతో మ్యాచ్ ఇండియా చేతుల్లోకి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, ఆ తర్వాత టీమిండియా ఆటగాళ్లు క్యాచ్‌లు వదిలేయడం తో మ్యాచ్ ఇంగ్లండ్ వైపు తిరిగింది.

కీలకమైన క్యాచ్‌లు వదిలేసిన ఇండియా!

క్రౌలీ వికెట్ తీసిన తర్వాత కూడా బుమ్రా చాలా సార్లు వికెట్లు తీసే అవకాశాలను సృష్టించాడు. కానీ, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా క్యాచ్‌లు వదిలేయడంతో బెన్ డకెట్‌కు రెండుసార్లు లైఫ్ దక్కింది. ఈ అవకాశాలను వాడుకున్న డకెట్, 62 పరుగులు చేసి చివరికి బుమ్రా బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.

అది పోతే పోయింది అనుకుంటే, ఆ తర్వాత కూడా జైస్వాల్ మళ్ళీ చెత్త ఫీల్డింగ్ కొనసాగించాడు. హాఫ్ సెంచరీ కొట్టి మంచి ఊపు మీదున్న ఓలి పోప్ క్యాచ్‌ను కూడా వదిలేశాడు. ఈ క్యాచ్ కూడా బుమ్రా బౌలింగ్‌లోనే చేజారింది. ఇలా టీమిండియా ముందుగా తమ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ సరిగా ఆడక, ఆ తర్వాత చెత్త ఫీల్డింగ్ వల్ల రెండో రోజు ఆటలో పూర్తిగా వెనకబడింది.

భారత్ తొలి ఇన్నింగ్స్ 471 రన్స్‌కు ఆలౌట్!

ఇక అంతకు ముందు, టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. భారత్ తరఫున యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీలు కొట్టి రాణించారు. కేఎల్ రాహుల్ కూడా 42 పరుగులు చేశాడు. ఈ నలుగురు బ్యాట్స్‌మెన్‌లు తప్ప, మిగిలిన వాళ్ళెవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఇంగ్లండ్ తరఫున, కెప్టెన్ బెన్ స్టోక్స్, ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు తీశారు. బ్రేడన్ కార్సె, షోయబ్ బషీర్ చెరో ఒక వికెట్ పడగొట్టారు.

CR Reddy

CR Reddy

Next Story