IND vs SA 1st Test Day 1: దద్దరిల్లిన ఈడెన్ గార్డెన్స్...బుమ్రా దెబ్బకు 159 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్!

IND vs SA 1st Test Day 1: ఆరు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో టెస్ట్ క్రికెట్ మళ్లీ ప్రారంభమైంది.

CR Reddy
Published on: 15 Nov 2025 10:36 AM IST
IND vs SA 1st Test Day 1
X

IND vs SA 1st Test Day 1: దద్దరిల్లిన ఈడెన్ గార్డెన్స్...బుమ్రా దెబ్బకు 159 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్!

IND vs SA 1st Test Day 1: ఆరు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో టెస్ట్ క్రికెట్ మళ్లీ ప్రారంభమైంది. అభిమానులకు నిరాశ కలిగించకుండా, టీమ్ ఇండియా తొలి రోజు ఆటలో సౌత్ ఆఫ్రికాపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్‌తో కకావికలం చేయగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ జట్టు కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి సౌత్ ఆఫ్రికా బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో విఫలమవడం టీమ్ ఇండియాకు చిన్న లోటుగా మిగిలింది.

నవంబర్ 14, శుక్రవారం కోల్‌కతాలో మొదటి టెస్ట్ ప్రారంభం కాగా, టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సఫారీ ఓపెనర్లు 10.3 ఓవర్లలోనే 57 పరుగులు చేసి దూకుడుగా ఆటను ప్రారంభించినా, అక్కడి నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయారు. క్రమంగా వికెట్లు కోల్పోయిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ జట్టు కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది.

సౌత్ ఆఫ్రికా ఈ విధంగా కుప్పకూలడానికి ప్రధాన కారణం స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. మొత్తం 10 వికెట్లలో, బుమ్రా ఒక్కడే 5 వికెట్లు తీసుకుని సంచలనం సృష్టించాడు. మొదట్లో రెండు, ఇన్నింగ్స్ చివరిలో రెండు వికెట్లు తీసి, తన టెస్ట్ కెరీర్‌లో 16వ సారి 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. బుమ్రాతో పాటు, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ చెరో 2 వికెట్లు తీసుకోగా, అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ లభించింది. మ్ ఇండియా బ్యాటింగ్ ప్రారంభించగా, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి సౌత్ ఆఫ్రికా బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో విఫలమయ్యాడు.

గతంలో సౌత్ ఆఫ్రికా పర్యటనలోనూ జైస్వాల్ 4 ఇన్నింగ్స్‌లలో 50 పరుగులు మాత్రమే చేసి ఫెయిల్ అయ్యాడు. ఈసారి స్వదేశంలో కూడా అతడు మార్కో జాన్సెన్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయి, నిరాశపరిచాడు. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత మూడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌కు రావడం చర్చనీయాంశమైంది. సాయి సుదర్శన్‌కు బదులుగా సుందర్‌ను ఎంచుకోవడంపై కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వచ్చినా, సుందర్ కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ ఇద్దరూ కలిసి స్పిన్నర్ల బౌలింగ్‌ను జాగ్రత్తగా ఎదుర్కొని 14 ఓవర్లలో 19 పరుగులు జోడించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ ఇండియా స్కోర్ 1 వికెట్ నష్టానికి 37 పరుగులుగా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్ మరియు వాషింగ్టన్ సుందర్ ఉన్నారు.

CR Reddy

CR Reddy

Next Story