IIT Baba:పాకిస్తాన్ గెలుస్తుందని జోస్యం చెప్పిన ఐఐటి బాబా.. సోషల్ మీడియాలో ట్రోల్స్‌తో క్షమాపణలు..

ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ జట్టు ఓడిపోతుందని జోస్యం చెప్పిన ఐఐటి బాబా అభయ్ సింగ్ క్షమాపణలు చెప్పారు.

Vijaya Laxmi
Published on: 24 Feb 2025 3:47 PM IST
IIT Baba Apologizes to trollers For Predicting India Defeat Against Pakistan
X

పాకిస్తాన్ గెలుస్తుందని జోస్యం చెప్పిన ఐఐటి బాబా.. సోషల్ మీడియాలో ట్రోల్స్‌తో క్షమాపణలు..

IIT Baba: ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ జట్టు ఓడిపోతుందని జోస్యం చెప్పిన ఐఐటి బాబా అభయ్ సింగ్ క్షమాపణలు చెప్పారు. ఏరోస్పేస్ ఇంజనీర్ అయిన అభయ్ సింగ్ ఆ తర్వాత సాధువుగా మారి ఐఐటి బాబాగా పేరు పొందారు. మహాకుంభమేళాలో సాధువుగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతుందని జోస్యం చెప్పి నెటిజన్లకు టార్గెట్ అయ్యారు. దీంతో ఐఐటి బాబాపై నెట్టింట ట్రోల్స్ వెల్లువెత్తాయి.

భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన పోరులో భారత్ విజయం సాధించింది. ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించింది. విరాట్ కోహ్లీ అద్బుతమైన సెంచరీతో టీమిండియాను విజేతగా నిలిపారు. కాగా ఈ మ్యాచ్ తర్వాత నెటిజన్లు ఐఐటీ బాబా అలియాస్ అభయ్ సింగ్‌ను ఏకిపారేశారు. మహా కుంభమేళాతో ఫేమస్ అయిన ఈ బాబా మ్యాచ్‌ ముందు ఓ ఇంటర్వ్యూలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై జోస్యం చెప్పాడు. పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోతుందని అన్నారు.

అయితే కొన్ని గంటల్లోనే బాబా జోస్యం తప్పని తేలిపోయింది. బాబా అంచనాలకు విరుద్ధంగా టీం ఇండియా పాకిస్తాన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. అలాగే విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై అద్భుతమైన సెంచరీ సాధించారు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఐఐటీ బాబాను ఏకిపారేశారు. భారత్ ఓడిపోతుందన్న ఐఐటీ బాబా ఎక్కడ..? అంటూ కామెంట్స్ చేశారు. ఇలా జాతకాలు, జోస్యాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.

తప్పుడు జోస్యంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ఐఐటి బాబా అభయ్ సింగ్ స్పందించారు. క్షమాపణలు చెబుతూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు. విరాట్ కోహ్లీ, టీమిండియా సంబరాలు చేసుకుంటున్న ఫొటోలను దానికి జోడించారు. నేను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఇది పార్టీ టైం. కాబట్టి ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకోవాలి. భారత్ గెలవదని చెప్పాను కానీ.. గెలుస్తుందని నా మనసుకు తెలుసు అని ఆ పోస్టులో రాసుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. ఆ జట్టు తరపున సౌద్ షకీల్ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత భారత్ కేవలం 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేధించి మ్యాచ్‌ను గెలిచింది. టీమిండియా తరుపున కోహ్లీ వంద పరుగులు చేయగా.. శ్రేయాస్ అయ్యర్ 56 పరుగులు చేశారు. సెంచరీతో భారత్‌ను విజేతగా నిలిపిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.


Vijaya Laxmi

Vijaya Laxmi

Next Story