
Vaibhav Suryavanshi: 14 ఏళ్లకే స్టార్డమ్.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్.. ఇంతకీ ఏమైందంటే ?
Vaibhav Suryavanshi : ఇంగ్లండ్ అండర్-19 జట్టుపై అద్భుత ప్రదర్శనతో యువ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాడు.
Vaibhav Suryavanshi : ఇంగ్లండ్ అండర్-19 జట్టుపై అద్భుత ప్రదర్శనతో యువ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాడు. వన్డే సిరీస్ తర్వాత, మొదటి యూత్ టెస్ట్ మ్యాచ్లో కూడా అతను అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఇంగ్లండ్లో కూడా వైభవ్ సూర్యవంశీకి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఎక్కడికి వెళ్లినా ఆటోగ్రాఫ్ల కోసం జనం గుమికూడుతున్నారు. ఈ అసాధారణ పాపులారిటీ మధ్య, వైభవ్ సూర్యవంశీ తన కెరీర్పై పూర్తి దృష్టి పెట్టాలని అభిమానులు సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నారు. అతను అద్భుతాలు చేస్తున్న ప్రతిసారీ, అభిమానులు అతనికి పృథ్వీ షా పరిస్థితిని గుర్తు చేస్తున్నారు.
వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్లో పిల్లలకు ఆటోగ్రాఫ్లు ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా మంది అభిమానులు అతని పాపులారిటీ పట్ల సంతోషం వ్యక్తం చేయగా, కొందరు వైభవ్కు హెచ్చరికలు జారీ చేశారు. ఒక అభిమాని "గేమ్పైనే దృష్టి పెట్టండి, లేకపోతే ఇండియా పృథ్వీ షాను కూడా చూసింది" అని రాశాడు. మరొక అభిమాని "వైభవ్ చాలా టాలెంటెడ్. అయితే, ఈ పేరు, కీర్తిని వైభవ్ తట్టుకోగలడా అనే భయం నాకు ఉంది. వైభవ్ తల్లిదండ్రులు అతన్ని ఒదిగి ఉండేలా చూస్తారని ఆశిస్తున్నాను." యువ ఆటగాళ్లు తొందరగా వచ్చే స్టార్డమ్ను తట్టుకోలేక కెరీర్ను పాడు చేసుకున్న ఉదంతాలు ఉండడంతో అభిమానులు ఇలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైభవ్ సూర్యవంశీ తన కెరీర్పై దృష్టి పెట్టాలని సలహాలు అందుకుంటున్నప్పటికీ, ఈ యువ ఆటగాడికి రాజస్థాన్ రాయల్స్ పూర్తి మద్దతు ఇస్తోంది. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ నేరుగా దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రావిడ్తో సంప్రదింపులు జరుపుతున్నాడు. ఐపీఎల్ 2025 సందర్భంగా, ద్రావిడ్ స్వయంగా వైభవ్, అతని తల్లిదండ్రులతో తాను టచ్లో ఉన్నానని వెల్లడించారు. వైభవ్ సరైన మార్గంలో ముందుకు సాగి త్వరలో టీమ్ ఇండియాలోకి అడుగుపెడతాడని ఆశిస్తున్నారు.
ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన యూత్ వన్డే సిరీస్, టెస్ట్ సిరీస్లలో వైభవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. వన్డే సిరీస్లో అత్యధికంగా 355 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 71 కాగా, స్ట్రైక్ రేట్ 174 కంటే ఎక్కువ. వైభవ్ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. ఈ సిరీస్లో అత్యధికంగా 29 సిక్సర్లు కొట్టాడు. యూత్ టెస్ట్లో కూడా వైభవ్ తన ముద్ర వేశాడు. మొదటి ఇన్నింగ్స్లో 14 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, రెండో ఇన్నింగ్స్లో కేవలం 44 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో టీమిండియాకు ఒక ఆశాకిరణంగా మారతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




