VaraLakshmi Vratham Puja 2020: వరలక్ష్మీ వ్రతం.. తేదీ, పూజా సమయం

VaraLakshmi Vratham Puja 2020: వరలక్ష్మీ వ్రతం.. తేదీ, పూజా సమయం
x
Highlights

VaraLakshmi Vratham Puja 2020: చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాదిలోని ఐదో నెల శ్రావణం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ పండగే....

VaraLakshmi Vratham Puja 2020: చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాదిలోని ఐదో నెల శ్రావణం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ పండగే. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం హిందూ ఆచారం. అంతే కాదు ఈ మాసంలో మంగళవారం శ్రావణ గౌరీ వ్రతం, శుక్రవారం మహాలక్ష్మీ పూజలు ఎంతో ప్రత్యేకం. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తికి భార్య. శ్రీమహావిష్ణువు దేవేరి మహాలక్ష్మీ అష్టవిధ రూపాలతో సర్వ మానవాళి కోరికలు తీరుస్తూ, ఎల్లవేళలా రక్షిస్తుంది.


అయితే ఈ పూజలు ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు. ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. అంతే కాదు పెళ్లి కాని కన్నె పిల్లలు కూడా మంచి భర్త, కుమారులు కలగాలని అమ్మవారిని కొలుస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా ఈ పూజలో పాలుపంచుకుంటారు.


ఈ ఏడాది జులై 31న రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకోవాలి. ఆరోజు శుక్రవారం ఉదయం 6.59 నుంచి 9.17 వరకు సింహలగ్నం, ఈ రెండు గంటల 18 నిమిషాలలో పూజ చేసుకోవచ్చని పండితులు తెలియజేశారు. ఒక వేళ అనుకోని పరిస్థితుల్లో ముహూర్తం దాటితే మళ్లీ మధ్యాహ్నం 1.53 నుంచి 4.11 మధ్య వృశ్చిక లగ్నం ముహూర్తం 2.18 గంటల వరకు పూజ చేసుకోవచ్చని పండితులు తెలిపారు. ఈ సమయం కూడా దాతిటే మళ్లీ రాత్రి 7.57 నుంచి 9.25 వరకు కుంభలగ్నం 1.28 నిమిషాలు, రాత్రి 12.25 నుంచి 2.21 వరకు వృషభలగ్నం ముహూర్తం 1.56 గంటలు వ్రతాన్ని చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఎందుకు ఈ వ్రతం చేస్తారు...

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. వరలక్ష్మీ వ్రతంతో మనకు సర్వం ప్రాప్తిస్తాయి. శ్రీ (ధనం), భూ (భూమి), సరస్వతి (చదువు), ప్రీతి (ప్రేమ), కీర్తి, శాంతి, తుష్టి (సంతోషం), పుష్టి (బలం) కలుగుతాయి.

వరలక్ష్మీ వ్రతాన్ని ఎలా ఆచరించాలి..

వరలక్ష్మీ వ్రతం రోజున అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజులు తెల్లవారుజామునే కుటుంబ సభ్యులందరూ నిద్రలేచి, అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఆ తరువాత ఇంటి ఈశాన్య భాగంలో ఆవుపేడతో చక్కగా అలికి రంగుల ముగ్గులు పెట్టి, మండపాన్ని అందంగా ఏర్పాటుచేయాలి. ఆ తరువాత ఆ మండపంలో కొత్తబియ్యం పోసి అందంగా అలంకరించాలి. తరువాత కలశాన్ని ఉంచి, మర్రి, మామిడి, మేడి, జువ్వి, రావి చిగుళ్లను అందులో వేయాలి. కలశంపై నారికేళాన్ని పెట్టి ఎరుపు రంగు రవిక గుడ్డను దానికి అలంకరించాలి.

వరలక్ష్మి వ్రతం పూజ సామగ్రి

పసుపు, కుంకుమ, తమల పాకులు, వక్కలు, అరటి పండ్లు, ఊదు బత్తీలు/దూపం కలికెలు, హారతి కర్పూరము, పసుపు అక్షతలు, పూలు, కొబ్బరి కాయ/కలశం మీదికి, కొబ్బరికాయ అర్చనకు, దీపారాధన కుంది - పెద్దది, దీపారాధన కుంది - చిన్నది, గంధం, గంట, హారతి పళ్లెము, వత్తులు, దీపారాదన నూనె ఆవునెయ్యి, అమ్మవారికి కలశము, అర్చన కలశము, పంచామృతాలు, అమ్మవారికి పీఠము/పీట, ఒక పళ్లెము - దీపారాధన హారతి పళ్లెము ఉంచుటకు, బియ్యముతో ఉన్న చిన్న పళ్లెము పసుపు గణపతికి, ఒక రవికె గుడ్డ, అమ్మవారి అలంకరణ సామగ్రి, వడపప్పు, (ఆనవాయితీ ఉంటే) పానకము (ఆనవాయితీ ఉంటే), పతిని పావలా కసుగా చేసి కుంకుమతో అధినవి రెండు వస్త్రాలు, పత్రితో రుద్రాక్షమాలగా చేసి పసుపు/కుంకుమ లతో అలదిన యజ్ఞ ఉపవీతము, అర్చన కలశము ప్రక్కన గిన్నె, ఆచమనమునకు గ్లాసు ప్రక్కన పల్ల్లేము, కొద్దిగ ఏలకులు/లవంగాల పొడి, చెంచాలు, కూర్చొను వారికి తగినన్ని పీటలు, నూతన వస్త్రాలు అమ్మవారికి ధరింప దలచితే ప్రత్హి వస్త్రాలు అక్కరలేదు, మామిడి ఆకులు మందిర అలంకరణకు, చిల్లర రూపాయిలు, పన్నీరు లేక గంధము కలిపిన నీరు, నవ సూత్రములు ఎంత మంది పూజకు ఉంటే అంతమందికి తెల్లని దారములు తీసుకొని తొమ్మిది ముడులు వేసి కుంకుమలో అలధినవి. పాటకు జ్యోతులు తొమ్మిది బియ్యపు పిండి బెల్లముతో కలిపి చేసినవి, నానబోసిన శనగలు,

వ్రత విధి విధానం

అందంగా అలంకరించిన మండపంలోని కలశం ముందు భాగంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ, చిత్రపటాన్ని కానీ ఉంచాలి. తొలుత పసుపుతో గణపతిని చేసి పూజించి, కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీగా భావించి వాయనమీయవలెను.

వరలక్ష్మి వ్రత కథ

ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల మునిగణ సంసేవితుడైయున్న సమయంబున పార్వతీ దేవి వినయంబుగా, "ప్రాణేశ్వరా! స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవీయు"డని కోరెను. అంతట పరమేశ్వవరుడు, "దేవీ! వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును. దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలెను" అనెను. అది విని యామె, "స్వామీ! ఆవ్రతం ఎలా ఆచరించవలెనో సెలవీ"య వేడెను. ,, "ఆ వ్రతాన్ని మునుపు ఎవరాచరించి తరించారో తెలుపగోరెద" ననెను. అంతట పరమేశ్వరుడు "ఓ పడతీ! ఆ వ్రతకథను చెప్పెదను వినుము" అని కథ చెప్పెను.

పూర్వము మగధ రాజ్యమున కుండిన నగరమను నొక పురము గలదు. అది బహుసుందరమయిన పట్టణము. అందు చారుమతి యను ఒక సాధ్వి ఉంది. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో, "చారుమతీ! నీసధ్గుణములకు నేను మెచ్చితిని నీకు కావలయు వరములనొసగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతము చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను దీర్చెద" నని చెప్పి మాయమయ్యను. వెంటనే ఆమె మేల్గాంచి, తన స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదింప నతడునూ మిగుల సంతోషించి ఆమెనా వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను. ఆస్వప్న వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణమాసం కొరకు ఎదురుచూచుచుండిరి. అంతలో శ్రావణమాసము వచ్చెను. అంతట చారుమతి వారందరితో కలసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి, ఒక చోట ఆవు పేడతో అలికి, బియ్యముతో మంటపమేర్పరచి మర్రిచిగుళ్ళు మొదలగు పంచ పల్లవులతో కలశంబేర్పరచి, అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి, సాయంత్రమైనంత నధిక భక్తితో


లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం

శ్రీ రంగథామేశ్వరీం|

దాసీభూత సమస్తదేవ వనితాం

లోకైక దీపాంకురాం|

శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవః

బ్రహ్మేంద్ర గంగాధరాం|

త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసిజాం

వందేముకుందప్రియాం||

అని స్తుతించి, తొమ్మిది రంగులు గల తోరణము కుడిచేతికి గట్టుకొని, యధాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి, ప్రదక్షణ మొనర్చెను. అట్లు వారు ప్రదక్షణము చేయుచుండగా ఘల్లు ఘల్లు మని ధ్వని వినిపించుటచే వారు క్రిందకి చూడగా వాళ్ళ కాళ్ళకు గజ్జెలు, అందెలు మున్నగు ఆభరణములు కనిపించెను. కానీ భక్తి తప్పక వారు రెండొవసారి ప్రదక్షణము చేయగా వారి హస్తములు నవరత్నఖచిత కంకణ సుందరము లయ్యెను. మూడవ ప్రదక్షణము చేసిన వెంటనే వారి యిండ్లు సకల సంపత్సమృధ్ధము లయ్యెను. పిమ్మట చారుమతీ వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యధావిధిగా యధాశక్తిని దక్షిణ తాంబూలాదుల నొసంగి సంతుష్టిని చేసి పంపి, వ్రత ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి, తానునూ భుజించి, సుఖముగా నుండెను. ఆమె లోకోపకారముగా నిట్టి వ్రతమును జేయించినందులకు ఊరిలోనివారందరూ ఆమెను వేనోళ్ళ బొగడిరి. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరమూ చేయుచుండిరి. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారునూ జేయవచ్చును. ఆ వ్రతాచరణము వలన వరలక్ష్మీ ప్రసాదము కలిగి సకల కార్యములందునూ విజయము చేకూరును.



Show Full Article
Print Article
Next Story
More Stories