Vizianagaram: భక్తులకు అండగా...అమ్మ ఉండగా

Vizianagaram: భక్తులకు అండగా...అమ్మ ఉండగా
x
Highlights

అమ్మల గన్నమ్మ ముగురమ్ముల మూలపుటమ్మ ఆదిశక్తి స్వరూపిణి పార్వతీదేవి అవతారమే పోలేశ్వరి అమ్మ అని భక్తులు నమ్ముతారు.

అమ్మల గన్నమ్మ ముగురమ్ముల మూలపుటమ్మ ఆదిశక్తి స్వరూపిణి పార్వతీదేవి అవతారమే పోలేశ్వరి అమ్మ అని భక్తులు నమ్ముతారు. తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క-సారక్క, అనకాపల్లిలో నూకాలంబ, విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా శంబర పోలమ్మ సంబరాలు ఘనంగా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లోని సాలూరు పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో మక్కువ గ్రామానికి 6 కిలోమీటర్ల ఉన్న శంబర గ్రామంలో ఈ శంభర పండగను చేస్తారు. ఈ పండగను ప్రతిఏటా సంక్రాంతి పండగ తరువాత పది రోజుల్లో చేస్తారు. అయితే ఈ పండగ ఆంధ్రప్రదేశ్ అంతటికీ కాకుండా కేవలం శంబర అనే ఒక్క గ్రామంలో మాత్రమే పోలమాంబ అమ్మవారి జాతరను ఏటా జనవరి 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తుంటారు. ఈ జాతరను ఆ గ్రామంలోని ప్రజలు కూలి పనులకు వెళ్లి కొంత సొమ్మును దాచి పెట్టి మరీ వైభవంగా జరిపిస్తారు. ఎంత ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా సరే అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని అక్కడి ప్రజల నమ్మకం. అన్ని పండగలు చేసుకున్నట్టు గానే కొత్త బట్టలు కొనుకుంటారు. అమ్మవారికి కూడా చీరను తీసుకుని రథంమానుకు చీరలు చూపించి, కోళ్లు మొక్కుబడులు చెల్లించుకుంటారు. వారి బంధువులను పండగకు ఆహ్వానిస్తారు.

ఈనెల 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు దేవాదాయ శాఖాధికారులు ముమ్మర ఏర్పాట్లను చేస్తున్నారు. వనంగుడి వద్ద భక్తులు తాగునీటి కుళాయిలు నిర్మిస్తున్నారు. చదురుగుడి క్యూలైన్ల వద్ద భక్తుల తలనీలాలకు టెంట్లు ఏర్పాటు చేశారు. గోముఖినది ఒడ్డున రహదారికి ఇరువైపులా తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేశారు. చదురుగుడి వద్ద క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వనంగుడి వద్ద, చదురుగుడి వద్ద మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నింటిని కూడా సాలూరు సీఐ సింహాద్రినాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

అమ్మవారి అవతారం..

ఒకానొక కాలంలో పార్వతీపురం గిరిజన ప్రాంతానికి చెందిన మక్కువ మండలంలోని శంబర అనే ప్రాంతంలో ఉండేది ఈ శంబర గ్రామం. పూర్వం దండకారణ్య ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతాన్ని శంబాసురుడనే రాక్షసుడు పరిపాలించేవాడని చరిత్ర చెపుతుంది. అయితే శంబాసురుని పరిపాలనలో ఈ ప్రాంతం ఉండటంతో ఈ ప్రాంతానికి శంబర అని పేరువచ్చింది. ఈయన పరిపాలనలో ప్రజలు, మునులు ఎన్నో చిత్రహింసలు అనుభవించేవారట. ఎలాగయినా ఆ రాక్షసుని బారినుంచి తప్పించమని ఆ రాజ్య ప్రజలు, మునులు అమ్మవారిని వేడుకున్నారట. దీంతో ఆమె భక్తుల భాధను చూడలేక సాక్షాత్తు ఆ పరమేశ్వరి దేవియే పోలేరేశ్వరిగా అవతారమెత్తి, శంబాసురున్ని సంహరించిందని చెపుతారు. ఇక ఆ కాలం నుంచి పోలేశ్వరి పోలమాంబగా పేరుగావించి ఆ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవంగా పూజలందుకొంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories