సాధారణంగా హిందూ దేవాలయాలు కొండల్లో, పర్వత ప్రాంతాల్లో, గుహల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో, జలపాతాలు, నదులకు సమీపంలో అందమైన ప్రకృతి మధ్య ఎంతో గొప్పగా కనిపిస్తాయి.
సాధారణంగా హిందూ దేవాలయాలు కొండల్లో, పర్వత ప్రాంతాల్లో, గుహల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో, జలపాతాలు, నదులకు సమీపంలో అందమైన ప్రకృతి మధ్య ఎంతో గొప్పగా కనిపిస్తాయి. కానీ గుజరాత్ లోని ఓ ఆలయం మాత్రం భీకరమైన అలల ప్రవాహం మధ్య తీరానికి సముద్రం మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. అదే నిష్కలంక్ ఆలయం. నిష్కలంక్ అంటే పాపాలు దూరం చేసేది అని అర్ధం. మహాభారత యుద్ధం జరిగిన తరువాత పాండవులు తమ దోషాలను, కళంకాలను ఇక్కడే రూపుమాపుకున్నారని పురాణ కధనం. అందుకే ఇక్కడి శివుణ్ణి నిష్కలంక్ మహదేవ్ గా పూజిస్తారు.
ఆలయం సముద్రం నుంచి ఎప్పుడు బయటికి వస్తుంది..
భారతీయ క్యాలెండర్ ప్రకారం భదర్వ అమావాస్య రాత్రి పాండవులు నిష్కలంక్ మహదేవ్ ను స్థాపించారని చెబుతారు. నిష్కలంక్ మహా దేవ్ ఆలయం గుజరాత్ లోని భావ్ నగర్ కి 23 కిలో మీటర్ల దూరంలో, అరేబియా సముద్ర తీరంలో కొలియాక్ గ్రామం వున్నది. ఈ తీరం వెంట ఉదయం వచ్చే టూరిస్టులకు ఇక్కడ ఎటువంటి ఆలయం ఉన్నట్లు కనిపించదు. ఎందుకంటే అక్కడ సముద్రం లోపల మూడు కిలోమీటర్ల దూరంలో ఆలయం వెలసింది.
సముద్రం మధ్యలో ఆలయం ఉందనడానికి సూచికగా ఆలయ ధ్వజస్తంభంపై ఉండే జెండా మాత్రమే రెపరెపలాడుతూ కనిపిస్తుంది. ఈ ఆలయంలోని శివుడిని ఎప్పుడు పడితే అప్పుడు దర్శించుకునే వీలుండదు. దానికంటూ ఓ ప్రత్యేకమైన సమయం ఉంటుంది. మధ్యాహ్నం 11 గంటలకు ముందు ఆ గుడి సముద్రంలో మునిగి పోతుంది. అప్పుడు గుడి ఆనవాళ్లు కూడ కనబడవు. 11 గంటల నుంచి నిదానంగా అలలు వెనక్కి వెళ్లిపోవడంతో గుడి బయటికి కనబడుతుంది. దీంతో భక్తులు ఆలయానికి చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవాలనుకున్న భక్తులు రాత్రి 7 గంటల వరకూ మాత్రమే దర్శించుకోవాలి. ఆ సమయం దాటిన తరువాత సముద్రం మళ్లీ ముందుకు రావడం ప్రారంభిస్తుంది. అర్ధరాత్రి దాటే సమయానికి ఆలయం పూర్తిగా సముద్రగర్భంలో మునిగిపోతుంది.
దైవదర్శనం..
ఉదయం పది గంటలకే భక్తులు సముద్ర తీరానికి వస్తారు. రానురాను అలల ఉదృతి తగ్గగానే మెల్లమెల్లగా జెండాతో ఓ స్తూపము, ఐదు శివలింగాలు దర్శనమిస్తాయి. అప్పుడు భక్తులు వెళ్లి ఆ లింగాలకు పూజలు చేస్తారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో, మహా శివరాత్రి రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు భక్తులు. మరణించిన తమ పెద్దల అస్తికలను అక్కడ సముద్రంలో కలిపితే వారి అత్మ శాంతిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకోసం జనాలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈ ఆలయంలో ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం రోజున అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తారు.
ప్రతిరోజూ సముద్రుడు మధ్యాహ్నం 1 గంట సమయానికి వెనక్కి వెళ్లిపోతాడు. దీంతో అక్కడి భక్తులు శివున్ని చూడడానికి వెలుతుంటారు. అంతే కాదు భక్తులకు పూలు, పండ్లు, పూజా సామగ్రి అమ్మే వర్తకులు కూడా సముద్రం లోపలికి వెల్లగానే తమ సామాగ్రిని తోపుడు బండ్లపై వేసుకుని సముద్రంలో నడుచుకుంటూ ఆలయానికి చేరుకుంటారు. అయితే ఇప్పటి వరకూ సముద్ర గర్భంగా ఈ ఆలయం ఎలా నిర్మించారనే విషయం నేటి తరం ఇంజినీర్లకు, సాంకేతిక నిపుణులకు అంతుచిక్కని పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఈ ఆలయానికి వీక్షించిన వారు ప్రాచీన భారతీయుల పనితనాన్ని, నైపుణ్యాన్ని కొనియాడకుండా ఉండలేరు.
స్థల పురాణం
మహా భారత యుద్ధంలో పాండవులు గెలిచినా వారికి దాయాదులను చంపిన పాపం చుట్టుకుంటుంది. దాంతో ఆ పాపం నుండి విముక్తి పొందడానికి శ్రీకృష్ణుడిని శరణు కోరగా శ్రీకృష్ణుడు 'ఒక నల్లని ఆవుకు నల్లని జండా కట్టి అది ఎంత దూరం వెళితే అంత దూరం వెళ్లమని, ఎప్పుడైతే ఆ ఆవూ, జండా రెండు తెల్లగా మారతాయో అప్పుడు ఆ పాపం నుంచి ముక్తి లభిస్తుందని ' చెప్తాడు. ఆ మేరకు పాండవులు రోజులతరబడి ఆ ఆవు వెంట నడిచి వెళతారు. చివరికి కొలియాక్ గ్రామం సరిహద్దుల్లో అరేబియా సముద్ర తీరానికి చేరగానె ఆవు, జెండా తెల్లగా మారిపోతాయి.
ఆ ప్రాంతంలో పాండవులు శివనామం జపిస్తూ ఘోర తపస్సు చేయగా అప్పుడు శివుడు ఆ పంచ పాండవులకు ఒక్కొక్కరి ఎదుట ఒక్క స్వయంభూ శివలింగంగా అవతరిస్తాడు. ఆనందంతో పాండవులు ఆ అయిదు లింగాలకుపూజలు నిర్వహించి ఆలయాన్ని నిర్మిస్తారు. ఆ విధంగా పాండవులకు కళంకాలు తొలిగిపోగా ఆ ప్రదేశమే నిష్కలంక్ మహాదే వాలయంగా ప్రసిద్ధి పొందిందని పురాణ గాధ.
భదర్వి మాసంలో అమావాస్య రోజున పాండవులు ఈ దేవాలయాన్ని ఇక్కడ స్థాపించడంతో ప్రతి ఏటా శర్వణ్ మాసం (ఆగస్టు)లో అమావాస్య రోజున 'భైదర్వి' అనే పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మొక్కులు తీర్చుకునే ప్రతి భక్తునికి ప్రతి శివలింగం ఎదుట ఒక్కో నంది కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ముందుగా పాండవ కొలను అని పిలవబడే నీటి గుంట వద్ద తమ కాళ్లను శుభ్రపరచుకుని పూలు, పాలు, పండ్లతో శివలింగాలకు స్వయంగా అభిషేకిస్తుంటారు. ఇక ఈ సముద్రంలో ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కెరటాలు ఉధృతంగా వస్తుంటాయి. ఆ రోజుల్లో శివాలయం చేరుకోవాలనుకునే భక్తులు ఉదయాన్నే ఇక్కడికి చేరుకుని కెరటాలు శాంతించే వరకూ ఎదురుచూస్తుంటారు.
వెళ్ళే మార్గం
సికింద్రాబాద్ నుండి వెళ్లే భావనగర్ ఎక్స్ప్రెస్ లో భావనగర్ చేరి అక్కడి నుండి బస్సులు, ఆటోలు, టాక్సీల ద్వారా కొలియాక్ వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవచ్చు. విమాన మార్గం ద్వారా వచ్చే వారు అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగి 196 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire